Kerala: టీకా 2 డోసుల తర్వాత 40 వేల మందికి కరోనా

11 Aug, 2021 17:09 IST|Sakshi

కేరళలో వెలుగు చూసిన బ్రేక్‌త్రూ కేసులు

వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా 40 వేల మందికి పాజిటివ్‌

నమూనాలను జీనోమ్‌ సీక్వేన్స్‌ కోసం పంపాలన్న కేంద్రం

తిరువనంతపురం: దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతుండగా.. కేరళలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికి కేర‌ళ‌లో భారీగా కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా కేరళలలో వెలుగు చూస్తున్న కోవిడ్‌ కేసులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. కారణం ఏంటంటే వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికి కూడా రాష్ట్రంలో దాదాపు  40 వేల మంది కోవిడ్‌  బారిన ప‌డిన‌ట్లు తెలిసింది. కేంద్ర ఆరోగ్య‌శాఖ వ‌ర్గాలు ఈ విష‌యం వెల్ల‌డించిన‌ట్లు ఎన్డీటీవీ తెలిపింది. 

ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్ష‌న్‌ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కేంద్రం.. అలాంటి కేసుల న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాల‌ని కేర‌ళ‌కు సూచించింది. వ్యాక్సిన్లు అందించే రోగ‌నిరోధ‌క శ‌క్తిని బోల్తా కొట్టించే విధంగా వైర‌స్ మ్యుటేట్ చెందితే అది నిజంగా ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే అవుతుంద‌ని ఆరోగ్య శాఖ వ‌ర్గాలు వెల్లడించాయి. ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్ష‌న్ల‌కు డెల్టా వేరియంటే కార‌ణ‌మా.. లేదా అన్న విష‌యంపై ఇంకా స్ప‌ష్టత రాలేదు. 

వీటిలో చాలా కేసులు కేర‌ళ‌లోని ప‌త‌నంతిట్టా జిల్లాలోనే న‌మోద‌య్యాయి. ఈ జిల్లాలో తొలి డోసు తీసుకున్న త‌ర్వాత 14,974 మంది క‌రోనా బారిన ప‌డ‌గా.. మ‌రో 5,042 మందికి రెండో డోసు కూడా తీసుకున్న త‌ర్వాత క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అంతేకాదు కేర‌ళ‌లో చాలా అరుదుగా క‌నిపించే రీఇన్ఫెక్ష‌న్లు కూడా ఉన్న‌ట్లు ఆరోగ్య శాఖ వ‌ర్గాలు తెలిపాయి. కేర‌ళ‌లో కొన్ని వారాలుగా ప్ర‌తి రోజూ 20 వేల వ‌ర‌కూ కేసులు న‌మోదవుతున్నాయి.

మరిన్ని వార్తలు