కేరళలో వర్షబీభత్సం

8 Aug, 2020 10:07 IST|Sakshi
ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది 

కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి 

శిథిలాల కింద చిక్కుకున్న 50 మంది తేయాకు కార్మికులు

తిరువనంతపురం: కేరళలో కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 15 మంది మృత్యువాత పడ్డారు. ఇడుక్కి జిల్లా రాజమలలోని పెట్టిముడిలో విరిగిపడిన కొండచరియల కింద తేయాకు తోటల్లో పనిచేసే దాదాపు 50 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కార్మికుల నివాసాలపై భారీ కొండచరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఐదుగురు మహిళలు ఉన్నారు. శిథిలాల్లో చిక్కుకున్న 15 మందిని రక్షించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ వెల్లడించారు. (కేరళ: ఒకే రోజు రెండు విషాదాలు)

చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.5 లక్షలను, గాయపడ్డ వారికి ప్రభుత్వమే వైద్య సాయం అందిస్తుందని చెప్పారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బాధితులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఇవ్వనున్నట్టు ట్వీట్‌ చేశారు. భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది.  

మరిన్ని వార్తలు