కేరళలో ముదురుతున్న ‘చీరకట్టు’ వివాదం..

13 Nov, 2021 12:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మహిళా టీచర్లు చీర ధరించడం తప్పనిసరి కాదన్న కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం: మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి.. కేరళ ప్రగతిశీల వైఖరికి ఏమాత్రం అనుకూలంగా లేదని పేర్కొన్నారు. కేరళలోని అనేక విద్యా సంస్థలు తప్పనిసరిగా చీర ధరించాల్సిందేననే పద్దతిని కొనసాగిస్తున్నాయని పలువురు మహిళా ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.

‘‘ఎలాంటి దుస్తులు ధరించాలనేది మా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయంలో మీ జోక్యం ఏంటంటూ’’ బిందు విద్యాసంస్థల యాజమాన్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక తాను మినిస్టర్‌ని మాత్రమే కాక కేరళ వర్మ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నానని తెలిపారు. కాలేజీకి చుడిదార్‌లు వేసుకెళ్తాను అన్నారు. 
(చదవండి: చీర కట్టును ప్రపంచానికి చుట్టింది)

ఈ సందర్భంగా బిందు మాట్లాడుతూ.. "ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు తన వైఖరిని స్పష్టం చేసింది. కేరళలో ఉపాధ్యాయులు ఎలాంటి సంస్థలలో పనిచేసినా సరే.. వారి సౌకర్యానికి తగ్గట్టుగా దుస్తులు ధరించే హక్కు ఉంది. మహిళా ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా చీరలు ధరించాల్సిందే అనే ఈ పద్ధతి కేరళ ప్రగతిశీల వైఖరికి అనుకూలం కాదు’’ అన్నారు. 

"ఒక టీచర్‌కు అనేక బాధ్యతలు ఉంటాయి. అయితే ఇటువంటి పాత, వాడుకలో లేని ఆలోచనలకు కట్టుబడి ఉండటం ఆ బాధ్యతలలో ఒకటి కాదు. ఒకరి దుస్తుల ఎంపిక పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. మరొకరి దుస్తుల ఎంపికను విమర్శించే, జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు" అని బిందు స్పష్టం చేశారు. 
(చదవండి: ‘మిమ్మల్ని చీరలో చూస్తే.. కన్నీళ్లు ఆగవు’)

దీనిపై మినిస్టర్‌ మరింత స్పష్టత ఇస్తూ మే 9, 2014న ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసిందని తెలిపారు. అయినప్పటికి , రాష్ట్రంలోని అనేక సంస్థలు ఇలాంటి పద్ధతులను కొనసాగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అందుకే మరోసారి ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. 

చదవండి: చీర కట్టుకొని వస్తే ఎలా? రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు అవమానం

మరిన్ని వార్తలు