చావును టచ్‌ చేసి.. తృటిలో తప్పించుకున్నారు, లేదంటే తల పగిలేది!

10 Jun, 2023 14:00 IST|Sakshi

రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు ఏ రూపంలో ఎటు నుంచి వస్తాయో ఊహించలేం. అందుకే మన ప్రయాణ సమయంలో కాస్త ఆచితూచి డ్రైవింగ్‌ చేయడం చాలా ముఖ్యం. ఈ రోడ్డు ప్రమాదాల్లో కొన్ని మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చిన ఘటనలు చూసే  ఉంటాం.  ఇదే తరహాలో ఇద్దరు విద్యార్థినులు చావును టచ్‌ చేసి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే..  ఇద్దరు యువతులు స్కూటీపై వెళ్తుంటారు. ఇంతలో వారి ముందు వెళ్తున్న ప్రైవేటు బస్సును ఓవర్‌ టేక్‌ చేసేందుకు ఆ డ్రైవ్‌ చేస్తున్న యువతి ప్రయత్నిస్తుంది. అయితే ఆ రోడ్డు ఇరుకుగా ఉండడం, ఓవర్‌ టేక్‌ చేస్తున్న క్రమంలో ఎదురుగా మరో లారీ వస్తుంది. దీంతో లారీని ఢీకొట్టడంతో ఆ ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. బస్సు, లారీ మధ్య ఆ స్కూటీ ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో యువతులకు పెద్దగా గాయాలు కాలేదు.   

వారు ధరించిన హెల్మెట్లు కూడా రోడ్డుపై దొర్లాయి. బస్సులోని ప్రయాణికులు కూడా కిటికీ నుంచి ఈ ప్రమాదాన్ని చూస్తున్న వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వాహనం నడిపే సమయంలో జాగ్రత్త అవసరం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు