తీవ్ర హెచ్చరిక.. జాగ్రత్తగా వినండి సీఎం.. మధ్యలో వచ్చి బలికావొద్దు!

2 Apr, 2023 18:45 IST|Sakshi

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఖలిస్తాన్‌ ఉగ్రవాది, సిక్‌ ఫర్‌ జస్టిస్‌ సంఘం నేత గురుపత్వాన్‌ సింగ్‌ పన్నూ సీఎంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అస్సాం జర్నలిస్టులకు కాల్‌ చేసి ముఖ్యమంత్రిని బెదిరించాడు. పంజాబ్‌లో ఖలిస్తాన్‌ వేర్పాటు వాది, అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం గాలింపు కొనసాగుతున్న వేళ అస్సాం సీఎంకు బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. 

‘ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులను అస్సాంలో నిర్భంధించి హింసిస్తున్నారు. జాగ్రత్తగా వినండి సీఎం శర్మ.. ఇక్కడ పోరాటం ఖలిస్తాన్‌ అనుకూల సిక్కులకు.. భారత ప్రభుత్వానికి మధ్య జరుగుతోంది. అనవసరంగా ఈ హింసలో మీరు బలికావద్దు’ అని హెచ్చరించాడు. అలాగే ‘మేము ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ మేరకు శాంతియుత ప్రజాస్వామ్య పద్దతిలో భారత ఆక్రమణ నుంచి పంజాబ్‌ను విముక్తి చేయాలని కోరుతున్నాం. మీ ప్రభుత్వం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న అమృతపాల్ మద్దతురాలైన ఆరుగురుని ఖైదీలుగా మార్చి వేధింపులకు గురిచేస్తోంది. మీరు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పన్నూ ఫోన్‌లో బెదిరించాడు.

కాగా వారిస్‌ పంజాద్‌ దే చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పంజాబ్‌ పోలీసులు మార్చి 18 నుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులకు చిక్కిన్నట్లే చిక్కి వేషాలు, వాహనాలు మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు వందలాది ఖలిస్తాన్‌ మద్దతుదారులు, అమృత్‌పాల్‌ సహాయకులను పంజాబ్ పోలీసులు అరెస్ట్‌ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా అతడి ఆరుగురు సహాకులను అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
చదవండి: అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు..!

మరిన్ని వార్తలు