ఆ పులిని పట్టుకునేందుకు తొమ్మిది రోజులుగా 150 మందితో..

4 Oct, 2021 11:21 IST|Sakshi

సాక్షి, చెన్నై: జనంపై దాడి చేస్తున్న పులిని చంపకుండానే పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు అటవీశాఖ ఉన్నతాధికారి శేఖర్‌ కుమార్‌ నీరజ్‌ తెలిపారు. పులి జాడ ప్రస్తుతం కానరావడం లేదని, డ్రోన్ల సాయంతో వేట సాగుతున్నట్లు వివరించారు. నీలగిరి జిల్లా కూడలూరు పరిసరాల్లో ఓ పులి స్థానికులను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నలుగుర్ని చంపింది. ఈ పులిని పట్టుకునేందుకు తొమ్మిది రోజులుగా 150 మందితో కూడిన బృందం తీవ్రంగా వేట సాగిసోంది.

చదవండి: (డీఎంకే ఎన్నికల ఖర్చు రూ. 114 కోట్లు) 

చివరకు ఈ పులిని కాల్చి చంపేందుకు సైతం అనుమతులు జారీ అయ్యాయి. అయితే, పులి జాడ మాత్రం కాన రావడం లేదు. ఏ మార్గంలో వస్తోందో, జనం మీద దాడి చేసి ఎలా తప్పించుకుంటున్నదో అంతు చిక్కడం లేదు. దీంతో అనేక ప్రాంతాల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, డ్రోన్లకు కెమెరాల్ని అమర్చి వేటలో నిమగ్నమయ్యారు. ఈ పనుల్ని అటవీ శాఖ ఉన్నతాధికారి శేఖర్‌ కుమార్‌ నీరజ్‌ ఆదివారం పరిశీలించారు.

పులిని చంపేందుకు అనుమతులు ఉన్నా, చంపకుండానే పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పులి అంతరిస్తున్న అరుదైన జాతుల్లో ఒకటిగా భావిస్తున్నామన్నారు. ఎలాగైనా పులిని పట్టుకుంటామన్నారు. కాగా, పులిని చంపవద్దని, ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నించాలని మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌ డిమాండ్‌ చేశారు.  

చదవండి: (నటుడు విజయ్‌ సేతుపతి రూ. కోటి విరాళం)

మరిన్ని వార్తలు