కూలీ ఖాతాలో రూ.2700 కోట్లు .. షాక్‌ అయి బ్యాంక్‌ దగ్గరకు వెళ్తే..

3 Aug, 2022 13:31 IST|Sakshi

ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసినా, ఎక్కడైనా బిల్‌ పేమెంట్‌ చేసినా.. అకౌంట్‌లో ఇంకా ఎంత మనీ ఉందో చెక్‌చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. కష్టపడకుండా ఒకేసారి అకౌంట్లోకి కళ్లు చెదిలో డబ్బులు వచ్చి చేరితే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అంతేనా.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతే ఎంత బాగుంటుందో అని ఆశపడేవారూ లేకపోలేదు. ఇలాంటి ఓ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఓ దినసరి కూలీ కూడా క్షణాల్లో కోటీశ్వరుడిగా మారిపోయాడు. అకౌంట్‌లో కలలో కూడా ఊహించని మొత్తంలో అమౌంట్‌ చూసి కరెంట్‌షాక్‌ తగిలినంత పనిచేశాడు. చివరికి అసలు విషయం తెలిసి పాపం ఖంగుతున్నాడు. కన్నౌజ్‌ జిల్లాకు చెందిన 45 ఏళ్ల బిహారీ లాల్‌ ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. తన జన్‌ ధన్‌ ఖాతా నుంచి రూ. 100 విత్‌డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ వంద రూపాయలు డ్రా చేసిన తరువాత అతనికి ఒక మెసెజ్‌ వచ్చింది. ఇంకా అకౌంట్‌లో రూ. 2,700 కోట్లు ఉన్నట్లు మెసెజ్‌లో చూపించింది.

షాక్‌ తిన్న బిహారీ లాల్‌.. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ తీసి చూశాడు. అందులోనూ రూ. 2 వేల 7 వందల కోట్లు ఉన్నట్లుగానే కనిపించింది. వెంటనే బ్యాంక్‌ దగ్గరకు పరుగెత్తుకెళ్లి అధికారులకు ఈ విషయం చెప్పాడు. అధికారులు తనిఖీ చూస్తే బ్యాలెన్స్‌ కేవలం రూ.126 ఉన్నట్లు చూపించింది. దీంతో అవాక్కైన బిహారీ లాల్, తన అకౌంట్లో రూ.2700 కోట్లు చూపించిందని చెప్పాడు. అయితే అదంతా సాంకేతిక తప్పిదం అయ్యుంటుందని అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగాడు. అయితే బిహారీలాల్‌ అకౌంట్‌ను సీజ్ చేశామని, ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు తెలియజేశామని బ్యాంక్‌ వాళ్లు చెప్పారు.
చదవండి: ఎన్నో ఉద్యోగాలు వదులుకున్నాడు.. చివరికి కళ్లు చెదిరే ప్యాకేజీతో షాకిచ్చాడు!

మరిన్ని వార్తలు