Lalu Prasad Yadav: లంచం కేసులో లాలూకి క్లీన్‌ చీట్‌?

22 May, 2021 10:56 IST|Sakshi

లాలూకి వ్యతిరేకంగా ఆధారాల్లేవంటున్న సీబీఐ 

సాక్షి, న్యూఢిల్లీ: డీఎల్‌ఎఫ్ గ్రూప్‌ లంచం కేసులో మాజీమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి సీబీఐ క్లీన్‌ చీట్‌ ఇచ్చినట్టు సమాచారం. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సీబీఐ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో ఇప్పటికే మూడున్నరేళ్లు లాలూ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ క్లీన్‌ చీట్‌ ఇచ్చినా... ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ తమ విచారణ కొనసాగించనుంది. 

రైల్వే ప్రాజెక్ట్లులో ...
యూపీఏ 2 ప్రభుత్వ హయంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో  ముంబై, ఢిల్లీలలో రైల్వే ప్రాజెక్టులు దక్కించుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ డీఎల్‌ఎఫ్‌ లాలూకి లంచం ఇచ్చిందనేది ప్రధాన ఆరోపణ. డీఎల్‌ఎఫ్‌కి లబ్ధి చేకూర్చినందుకు 2007లో దక్షిణ ఢిల్లీలో రూ. 30 కోట్లు విలువ చేసే స్థలాన్ని లాలుకి కట్టబెట్టారని, ఆ తర్వాత 2011లో లాలూ కుటుంబ సభ్యులకు నామమాత్రపు ధరకే విలువైన షేర్లు అందించారనే  ఆరోపణలు వచ్చాయి. 

మూడేళ్ల విచారణ
లంచం తీసుకుని డీఎల్‌ఎఫ్‌ సంస్థకు అనుకూలంగా లాలూ తన పవర్స్‌ దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై   2018 జనవరిలో కేసు నమోదు చేసింది సీబీఐ, ఆర్థిక నేరాల విభాగం.  కేసు నమోదైన కొత్తలో పూర్వపు  స్టాంపు పేపర్లు ఫోర్జరీ చేశారని,  లాలూ కుటుంబ సభ్యులు ఆయాచితంగా లబ్ధి పొందారని... ఇలా అనేక ఆధారాలు ఆయనకి వ్యతిరేకంగా తమ వద్ద ఉన్నాయంటూ బెయిల్‌కి నిరాకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు విచారించిన తర్వాత ఆరోపణలకు తగ్గట్టు సరైన ఆధారాలు సంపాదించలేక పోయింది సీబీఐ. దీంతో లాలూకి  క్లీన్‌చీట్‌ ఇచ్చింది. డీఎల్‌ఎఫ్‌ లంచం కేసులో  2008 జనవరి నుంచి 2021 ఏప్రిల్‌ వరకు లాలూ జైలులోనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌​ రావడంతో లాలూ బయటకు వచ్చారు.  

మరిన్ని వార్తలు