విషమించిన లాలూ‌ ఆరోగ్యం.. ఢిల్లీ తరలింపు

23 Jan, 2021 14:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమించింది. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ కురవృద్దుడు ఇప్పటికే రాంచీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గతకొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో గత మూడు రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించింది. జైలు అధికారుల సమాచారం మేరకు తేజస్వీ యాదవ్‌, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, రబ్రీదేవి శుక్రవారం రాత్రి రాంచీ చేరుకుని ఆయన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రికి మెరుగైన ఆరోగ్యం అందించాలని తేజస్వీ యాదవ్‌ జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ను కోరారు. దీంతో వైద్యుల సూచనల మేరకు శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, మెరగైన వైద్యం కోసం ఢిల్లీ తరలిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లాలూ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనారోగ్య పరిస్థితుల కారణంగా లాలూకు వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాదులు పట్నా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఉంది.                          

మరిన్ని వార్తలు