చదువుకున్న బడి గేటు ఎదుట విగతజీవిగా

16 Feb, 2021 19:44 IST|Sakshi

బటాలా (పంజాబ్‌): దాయాదుల మధ్య ఏర్పడిన వివాదం ఓ విద్యార్థి ప్రాణం తీసింది. రెండు ఇళ్ల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో ఏర్పడిన గొడవ ఆ విద్యార్థి ప్రాణం మీదకు వచ్చింది. దాయాదులు ఆయుధాలతో వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పంజాబ్‌లోని బటాలాలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. గుమాన్‌ గ్రామానికి చెందిన 12వ తరగతి చదువుతున్న సిమ్రాన్‌దీప్‌ సింగ్ (18)‌ తన సోదరుడు హర్మన్‌దీప్‌ సింగ్‌తో కలిసి పాఠశాలకు వెళ్లాడు. తరగతుల అనంతరం పాఠశాల నుంచి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరిపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఆయుధాలతో వారిపై దాడికి పాల్పడ్డారు. తల, మెడ, ఛాతీపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన సిమ్రాన్‌దీప్‌ సింగ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ఈ దాడి నుంచి హర్మన్‌దీప్‌ సింగ్‌ ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ వారి చేతికి చిక్కడంతో సిమ్రాన్‌ దీప్‌ ప్రాణాలు కోల్పోయాడు.

పక్కింటి వారితో నెలకొన్న భూ వివాదమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పక్కింటివారిపై మృతుడి తండ్రి హర్‌దేవ్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు ఐపీసీ 302, ఇతర సెక్షన్ల కింద మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి సురేందర్‌ సింగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు