వైరల్‌: ‘మోదీజీ లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాం’

25 May, 2021 13:53 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడతాం.. అనుమతి ఇవ్వండి అంటూ పత్రికలో ఓ ప్రకటన వచ్చింది. ఓ కంపెనీ పేరిట వచ్చిన ప్రకటన వైరల్‌గా మారింది. ఏకంగా 37 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు ఏ రంగాల్లోనైనా పెడతామని ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లాండోమస్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరిట భారత్‌లో 500 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 37 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఆ గ్రూప్‌ కంపెనీ చైర్మన్‌ ప్రదీప్‌కుమార్‌ ఎస్‌ పేరిట ప్రకటన విడుదలైంది. లాండోమస్‌ రియాలిటీ వెంచర్స్‌ కంపెనీ 2015 జూలై 17వ తేదీన బెంగళూరులో రిజిస్టర్‌ అయ్యింది. ఇది అమెరికాకు చెందిన సంస్థ.

ఇంధనం, సామాజిక మౌలిక రంగం, ఉత్పాదన, రవాణా, ఆహార శుద్ధి, వ్యవసాయం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర రంగాల్లో తాము పెట్టేందుకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ప్రపంచ వాణిజ్య గమ్యస్థానంగా భారత్‌ను మార్చాలని భావిస్తున్నట్టు కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంత పెట్టుబడులు పెట్టే కంపెనీ నేరుగా ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకోకుండా ప్రకటన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు ప్రకటన అని, అది నమ్మొద్దని సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు