Lav Agarwal: బెంగళూరు, చెన్నైలలో పరిస్థితి దారుణం

5 May, 2021 18:23 IST|Sakshi

బెంగళూరులో ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌

కరోనా కేసులు పెరగడంపై ఆందోళన 

కేంద్ర వైద్యారోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర వైద్యారోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణపై లవ్‌ అగర్వాల్‌ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..'' నిన్నటి కంటే ఈరోజు 2.4 శాతం కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా 12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ పాటిజివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అసోం, గోవా, మణిపూర్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. బెంగళూరులో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వస్తోంది. మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్తర ప్రదేశ్‌‌, రాజ‌స్థాన్, ఆంధ్రప్రదేశ్‌‌, గుజ‌రాత్, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌డ్‌, ప‌శ్చిమ బెంగాల్, బిహార్, హ‌ర్యానా రాష్ట్రాల్లో ల‌క్ష చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి.

50 వేల నుంచి ల‌క్ష మ‌ధ్య యాక్టివ్ కేసులు 7 రాష్ట్రాల్లో ఉన్నాయి. 50 వేల కంటే త‌క్కువ కేసులు న‌మోదు అవుతున్న రాష్ర్టాలు 17 ఉన్నాయి'' అంటూ తెలిపారు. ఒక్క బెంగ‌ళూరులోనే వారం రోజుల్లో లక్షన్నరకు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయని తెలిపారు. బెంగ‌ళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువ‌గా ఉందన్నారు. త‌మిళ‌నాడులో 38 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. కోజికోడ్, ఎర్నాకులం, గురుగ్రామ్ జిల్లాల్లో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని చెప్పారు.

చదవండి:
కరోనా థర్డ్‌ వేవ్‌ తప్పదు: సంచలన హెచ్చరికలు

చైనా నిర్వాకం: ప్రపంచం నెత్తిన మరో ప్రమాదం...

మరిన్ని వార్తలు