కోవిడ్‌ లెక్కలు చెప్పే అగర్వాల్‌కు కరోనా

15 Aug, 2020 14:12 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ నేషనల్‌ హెల్త్‌ బులెటిన్‌ వివరాలను వెల్లడించే కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి ల‌వ్ అగ‌ర్వాల్‌ వైరస్‌ బారిన ప‌డ్డారు. తాజా ప‌రీక్ష‌లో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఈమేరకు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. కోవిడ్‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి హోం ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌ట్లు పేర్కొన్నారు. త‌న‌తోపాటు విధుల్లో పాల్గొన్న సహోద్యోగులు, ఇటీవల తను కలిసిన స్నేహితులు స్వీయ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలని ఈ సందర్భంగా లవ్‌ అగర్వాల్‌ విజ్ఞప్తి చేశారు. వారందరినీ ఆరోగ్య విభాగం బృందం త్వ‌ర‌లోనే కాంటాక్ట్ ట్రేసింగ్ చేయనుందని తెలిపారు. కరోనా నుంచి కోలుకుని త్వ‌ర‌లోనే అందుబాటులోకి వస్తానని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు. కాగా, దేశంలో కరోనా కేసులు మొదలైన గత ఆరు నెలల నుంచి కరోనా లెక్కలను మీడియాకు తెలుపుతూ ఆయన సుపరిచతమయ్యారు. కేంద్ర మీడియా సెంటర్‌లో ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తారు.
(నెలసరి సెలవు తీసుకున్నందుకు.. ఎన్నేసి మాటలు అన్నారో!)

మరిన్ని వార్తలు