అంతంత ఫీజులు సామాన్యుడు ఎలా భరించగలడు?.. లక్షల్లో లాయర్ల ఫీజులపై మంత్రి ఆందోళన

16 Jul, 2022 14:39 IST|Sakshi

జైపూర్‌: పౌరులకు ఉచిత న్యాయసేవను అందిస్తున్న దేశాల్లో మనది ఒకటి. అలాంటి దేశంలో కేసుల కోసం లక్షల నుంచి కోట్లలో ఫీజులు వసూలు చేస్తున్న న్యాయవాదులు ఉంటున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యల చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు. దేశంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగకుండా ప్రముఖ న్యాయవాదులు వసూలు చేస్తున్న అధిక లీగల్ ఫీజులపై ఆందోళన వ్యక్తం చేశారు.

శనివారం జైపూర్‌లో జరిగిన 18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్‌లో మంత్రి రిజిజు మాట్లాడుతూ.. “డబ్బున్నవాళ్లు బడా లాయర్లను నియమించుకుంటారు. అంతెందుకు సుప్రీంకోర్టులో ఉన్న కొందరు న్యాయవాదుల ఫీజులను సామాన్యులు భరించలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో వాదన కోసం రూ.10-15 లక్షలు వసూలు చేస్తే.. అసలు సామాన్యుడు ఎలా చెల్లించగలడు?. పేదలకు న్యాయం ఎలా అందుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా! అని న్యాయశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. జూలై 18, సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 71 వాడుకలో లేని చట్టాలను రద్దు చేస్తామని న్యాయ మంత్రి వెల్లడించారు.   

ఇక న్యాయ సేవల సమావేశానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా హాజరయ్యారు. ముహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియా జరిగిన ప్రచారంపైనా గెహ్లట్‌ స్పందించారు. “సస్పెండ్ చేయబడిన బిజెపి los నూపుర్ శర్మ పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఇద్దరు సుప్రీం న్యాయమూర్తులపై దుష్‌ప్రచారం ప్రారంభించడం చాలా ఆందోళన కలిగించే విషయం” అని ఆయన అన్నారు.

పనిలో పనిగా బీజేపీపై విరుచుకుపడిన గెహ్లాట్.. హార్స్‌ ట్రేడింగ్‌ ద్వారా ప్రభుత్వాలను మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. “దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. నా(రాజస్థాన్‌) ప్రభుత్వం ఎలా మనుగడ సాగించిందనేది ఆశ్చర్యం కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు