వీడియో: భర్తతో వాగ్వాదం.. చిర్రెత్తుకొచ్చి వెంటపడి మరీ చితకబాదిన లాయర్‌

7 May, 2022 14:26 IST|Sakshi

భోపాల్‌: ఓ కేసులో మహిళ తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఓ న్యాయవాది ఆమెను వెంటపడి మరీ దాడి చేశాడు. భరణం కోసం ఓ మహిళ.. భర్త మీద కేసు వేయగా.. ఆ భర్త తరపు వాదిస్తున్న న్యాయవాది ఆమెను పరిగెత్తించి మరీ కోర్టు ప్రాంగణంలోనే చితకబాదాడు. మధ్యప్రదేశ్‌ షాదోల్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పడు వైరల్‌ అవుతోంది. 

భారతి పటేల్‌(23) అనే ఆవిడ.. తన భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో.. విడాకుల భరణం కోసం ఆమె బియోహరి కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ కేసులో ఆ భర్త తరపున అడ్వొకేట్‌ భగవాన్‌ సింగ్‌(58) వాదిస్తున్నారు. అయితే పిటిషన్‌ వాదనలకు హాజరైన భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందట. ఈ క్రమంలో ఆమె తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఆ లాయర్‌ వెంటపడి మరీ దాడి చేశాడు. 

భగవాన్‌, భారతి పటేల్‌ వెంట పడుతూ కోర్టు సముదాయంలోనే చితకబాదాడు. అక్కడే కొందరు ఉన్నా చూస్తూ ఉండిపోయారే తప్ప.. అ‍డ్డుకునే ప్రయత్నం చేయలేదు. గురువారం ఈ ఘటన జరిగిందని, బాధితురాలి ఫిర్యాదు మేరకు భగవాన్‌ సింగ్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ దాడి విషయం తమ దృష్టికి రాలేదని, వస్తే చర్యలు తీసుకుంటామని బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు రాకేష్‌ సింగ్‌ బాఘెల్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు