చిరుత దాడి.. ఇంటికి వస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన వైనం

23 Jan, 2023 09:20 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: గత కొద్ది రోజులుగా మైసూరు జిల్లాలో చిరుత దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. శుక్రవారం రాత్రి చిరుత దాడిలో ఓ వృద్ధురాలు బలైన ఘటన టి.నరిసిపుర తాలుకాలో మరిచిపోక ముందే మరోఘటన అదే తాలూకాలో చోటు చేసుకుంది.  11 ఏళ్ల బాలుడు చిరుత దాడిలో బలయ్యాడు.  

ఇంటికి వస్తుండగా ఈడ్చుకెళ్లిన చిరుత..  
హోరళహళ్లి గ్రామానికి చెందిన దశకంఠ కుమారుడు జయంత్‌ (11) శనివారం సాయంత్రం అత్త ఇంటికి వెళ్లి బిస్కెట్‌ తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా పొదల మాటున నక్కిన చిరుత ఒక్కసారిగా దాడి చేసి జయంత్‌ను అడవిలోకి ఈడ్చుకుని వెళ్లింది. బాలుడిని చంపి కొంత తినేసింది. గ్రామస్తులు వెంటనే స్పందించి రాత్రి దాకా గాలించారు. ఎక్కడ కనిపించలేదు. ఆదివారం తెల్లవారుజామున కిలోమీటరు దూరంలో బాలుడి మృతదేహం కనిపించింది.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుతలకు బలి కావాల్సిందేనా అంటూ మండిపడ్డారు. టి నరసిపుర తాలూకాలో ఇప్పటి వరకు చిరుతల దాడిలో నలుగురు మృతి చెందారని, చిరుతను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు  కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.  
చదవండి: కన్నతల్లితో మరో వ్యక్తి సహజీవనం.. సన్నిహితంగా నటించి 

మరిన్ని వార్తలు