మంగళూరు : కుక్కను వెంటాడుతూ చిరుత పులి ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఘటన కర్ణాటకలోని ఉడిపిలో ఆదివారం చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున ఓ చిరుత పులి, కుక్కను వెంటాడుతూ బ్రహ్మవర్ తాలూకాలోని నైలాడి గ్రామంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. అనంతరం ఓ గదిలోకి వెళ్లి అక్కడే ఉండిపోయింది. వేరే గదుల్లో నిద్రపోతున్న ఆ ఇంటి వారు చిరుత ఉన్న గది నుంచి శబ్ధాలు రావటంతో అక్కడకు వెళ్లి చూశారు. చిరుత పులి కనిపించింది. దీంతో వెంటనే గది తలుపు మూసేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బోనుతో అక్కడికి చేరుకున్న అధికారులు ఓ గంట పాటు శ్రమించి చిరుతను బంధించారు. అనంతరం దాన్ని దగ్గరలోని అడవిలో వదిలేశారు.
కాగా, గతంలోనూ మంగళూరు ఏరియాలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ చిరుత పులి, కుక్కను వెంటాడుతూ ఓ ఇంటి బాత్రూంలోకి దూరింది. దాదాపు 10 గంటల పాటు చిరుత,కుక్క ఆ బాత్రూంలో గడిపాయి. అనంతరం అటవీ అధికారుల చొరవతో చిరుత బయటిపడింది. అయితే, ఈ ఘటనలో కుక్కకు ఎటువంటి గాయాలు కాకపోవటం విశేషం.
చదవండి : వైరల్: నల్లపులి, చిరుతల ఫైటింగ్!