తాజాగా లక్షా 73 వేల కేసులు, 3 వేల మరణాలు

29 May, 2021 10:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా మరోసారి 2 లక్షలకు దిగువకు రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య నమోందైంది. 24 గంటల్లో 1,73,790 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,617 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మరణాలు తగ్గితే దేశంలో కరోనా అదుపులోకి వచ్చినట్టుగా భావించవచ్చు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,84,601 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,77,29,247. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,28,724. కరోనాకు చికిత్స పొంది ఇప్పటివరకు డిశ్చార్జయిన వారి మొత్తం సంఖ్య 2,51,78,011. దేశంలో మొత్తం కరోనా మృతులు 3,22,512.

దేశంలో 90.80 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండడం గమనార్హం. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.04 శాతం. మొత్తం కేసులలో మరణాల రేటు 1.16 శాతంగా ఉంది. ఇక వ్యాక్సిన్‌ ప్రక్రియలో కొంత వేగం పెరిగింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,62,747 మంది  కరోనా వాక్సిన్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా రికార్డ్ స్థాయిలో నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 20,80,048.

మరిన్ని వార్తలు