శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బీజేపీ నేతలపై గురువారం జరిగిన దాడి వెనుక లష్కరే తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాదులు ఉన్నారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ధృవీకరించారు. లష్కరే తోయిబా అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఈ దాడికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. కాగా కుల్గాం జిల్లా బీజేవైఎమ్ జిల్లా కార్యదర్శి ఫిదా హుస్సేన్, కమిటీ సభ్యులు ఉమర్ హజం, ఉమర్ రషీద్ బేగ్ అనే వారిని గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 8 మంది బీజేపీ కార్యకర్తలు బలయ్యారు. తాజా ఘటనపై కుల్గాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తల హత్య నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. కుల్గం ఘటనను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సమర్థించలేమని, దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. (ముగ్గురు బీజేపీ నేతల కాల్చివేత )