-

ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు

21 Apr, 2021 15:37 IST|Sakshi

ముంబై: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. మధ్యతరగతి కుటుంబాల్లో ఎల్ఐసీ పాలసీ తీసుకొని ఫ్యామిలీ ఉండదంటే అతిశయోక్తి కాదు. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతీ చిన్న పల్లెకు ఎల్ఐసీ విస్తరించింది. తాజాగా ఎల్ఐసీ మరో రికార్డు సృష్టించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ పాలసీల ద్వారా కలెక్ట్ చేసిన ప్రీమియం విలువ ఒక లక్షా 84 వేల కోట్ల రూపాయలపైనే ఉంటుంది.

అలాగే, ప్రభుత్వ బీమా సంస్థ పాలసీదారులకు రూ.1.34 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లను ఈ సంవత్సరంలో చెల్లించింది. ఎల్ఐసీ స్థాపించిననాటి నుంచి ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రికార్డు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు అమ్మిన పాలసీల్లో ఎల్ఐసీ వాటా 74.58 శాతం. 2021 మార్చిలో ఎల్ఐసీ పాలసీల మార్కెట్ షేర్ 81.04 శాతం. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం, లాక్‌డౌన్ కాలంలో కూడా ఎల్ఐసీ కొత్త ప్రీమియం కలెక్షన్‌ల పరంగా రికార్డులు సృష్టించడం విశేషం.

గత ఆర్థిక సంవత్సరంలో 10.11 శాతం వృద్ధితో ఎల్‌ఐసి వ్యక్తిగత హామీ వ్యాపారం కింద మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయాన్ని 56,406 కోట్ల రూపాయలుగా ఆర్జించింది. పెన్షన్, గ్రూప్ స్కీమ్స్‌లో కూడా రికార్డులు సృష్టించినట్టు ఎల్ఐసీ ప్రకటించింది. కొత్త బిజినెస్ ప్రీమియం రూ.1,27,768 కోట్లు సేకరించినట్టు తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రీమియం రూ.1,26,749 కోట్లు. యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ బిజినెస్‌లో ఎల్ఐసీ ఎస్ఐఐపీ, నివేష్ ప్లస్ పాలసీలను పరిచయం చేసింది. 

చదవండి: 

యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా?

మరిన్ని వార్తలు