పుదుచ్చేరి సంక్షోభం: గవర్నర్‌ కీలక నిర్ణయం

18 Feb, 2021 19:26 IST|Sakshi

22న పుదుచ్చేరి ప్రత్యేక అసెంబ్లీ

తేలనున్న నారాయణస్వామి ప్రభుత్వ భవితవ్యం

కాంగ్రెస్‌ అధికారం పదిలమేనా? అనే సందేహాలు

పుదుచ్చేరి: ఎమ్మెల్యేల రాజీనామాలతో పుదుచ్చేరి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధం కావాలని తెలిపారు. దీనికోసం ఈనెల 22వ తేదీన పుదుచ్చేరి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. ఇటీవల లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడిని తొలగించి తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

సమావేశంలో ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సూచించారు. ప్రస్తుతం అసెంబ్లీలో రెండు పార్టీలకు ఎమ్మెల్యేలు సమానంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి భవితవ్యం సోమవారం తేలనుంది. 30 మంది సభ్యులున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నలుగురి రాజీనామాలతో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 28కి చేరింది. 

గతంలో మంత్రి నమశివ్వాయం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తెపైంతన్‌తో మరో ఇద్దరు రాజీనామాలు చేశారు. వీరందరి రాజీనామాతో ప్రస్తుతం ప్రభుత్వానికి 14 మంది (కాంగ్రెస్‌ 10, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది. దీనికి సమానంగా ప్రతిపక్షాల బలం 14 (ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

చదవండి: కిరణ్‌ బేడికి బై బై.. తమిళిసైకి బాధ్యతలు

మంత్రి రాజీనామా.. ప్రమాదంలో ప్రభుత్వం

మరిన్ని వార్తలు