కరోనా వైరస్‌తో సివంగి మృతి

4 Jun, 2021 20:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై : కరోనా వైరస్‌ కారణంగా ఓ తొమ్మిదేళ్ల సివంగి మృత్యువాతపడింది. చెన్నైలోని అరిగ్నర్‌ అన్నా జూలాజికల్‌ పార్కులో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. జూలోని నీలా అనే సివంగికి కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది. మొదట లక్షణాలు లేకపోయినప్పటికి ఆ తర్వాత సివంగి ముక్కులోంచి స్రావాలు రావటంతో చికిత్స మొదలుపెట్టారు. చికిత్స పొందుతున్న సదరు సివంగి గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతి చెందింది. జూ ఎన్‌క్లోజర్‌లోని ఐదు, సఫారీ పార్కులోని ఒక సింహం కరోనా లక్షణాలు కలిగి ఉండటంతో మొత్తం 11 సింహాలకు పరీక్షలు నిర్వహించారు.

వీటిలో తొమ్మిది సింహాల కరోనా శాంపిళ్లను భోపాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ డిసీజ్‌కు పంపారు. దీనిపై జూ అధికారి మాట్లాడుతూ.. ‘‘ కరోనా సోకిన సింహాలకు తమిళనాడు వెటర్నరీ అండ్‌ సైన్స్‌ యూనివర్శిటీ కోఆర్డినేషన్‌తో జూ వెటర్నరీ బృందం చికిత్స అందిస్తోంది. మరో సింహంతో పాటు అన్ని పులులకు టెస్టులు నిర్వహించి శాంపిళ్లను భోపాల్‌ పంపాము. మృతి చెందిన సివంగికి కరోనా వచ్చిందా లేదా అన్న సంగతి ధ్రువీకరించుకోవటానికి మరో సారి పరీక్ష నిర్వహించి, శాంపిళ్లను ల్యాబ్‌కు పంపాము’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు