లాక్‌డౌన్‌పై రేపు ముఖ్యమంత్రి ప్రకటన

9 Apr, 2021 19:06 IST|Sakshi

ముంబై: రోజుకు 50వేల నుంచి 60 వేల కేసులు నమోదవుతుండడంతో మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భయాందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలు, ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించారు. కాగా ప్రస్తుతం భారీగా కేసులు వెలుగులోకి వస్తుండడంతో ఇక లాక్‌డౌన్‌ విధించాల్సిందేనని ఆ రాష్ట్ర మంత్రి విజయ్‌ వాడెట్టివర్‌ సలహా ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేస్తారని చెప్పడం చూస్తుంటే లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది.

ముంబైలో ఆయన ఈ విషయమై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతుండడంతో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదన చేసినట్లు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి విజయ్‌ తెలిపారు. ప్రస్తుతం 5 లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. ఇదే మాదిరి కొనసాగితే పది లక్షలకు యాక్టివ్‌ కేసులు చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తెంచి వేయాలి.. ప్రజలను సామూహికంగా ఉండకూడదు అని పేర్కొన్నారు. 

కరోనా చెయిన్‌ను తెంచేందుకు.. వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు మూడు వారాల పాటు కఠిన లాక్‌డౌన్‌ విధించాలని మంత్రి విజయ్‌ స్పష్టం చేశారు. ఈ విషయమై రేపు అఖిలపక్ష సమావేశం ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే నేతృత్వంలో కొనసాగుతుందని చెప్పారు. రేపు ఏ విషయమో ముఖ్యమంత్రి ప్రకటిస్తారు అని తెలిపారు. తాను తన అభిప్రాయం మాత్రం చెప్పినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ అమలు చేస్తే ప్రజలకు నిత్యవసరాలు, కూరగాయలు అందిస్తామని చెప్పారు. ఏది ఏమున్నా రేపు సీఎం ఉద్దవ్‌ ప్రకటిస్తారని మంత్రి విజయ్‌ చెప్పి వెళ్లిపోయారు.

చదవండి: డ్రగ్స్‌ ఎమ్మెల్యేలు, వసూల్‌ మంత్రిని తొలగించండి
చదవండి: ‘ఆ నలుగురు’ లేక వృద్ధ దంపతుల ఆత్మహత్య

>
మరిన్ని వార్తలు