మళ్లీ ఎన్డీయేకే అధికారం

21 Oct, 2020 04:11 IST|Sakshi

లోక్‌నీతి– సీఎస్‌డీఎస్‌ ఒపీనియన్‌ పోల్‌ సర్వేలో వెల్లడి 

న్యూఢిల్లీ: బిహార్‌లో మరోసారి నితీశ్‌ సారథ్యంలోని ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ చేపట్టిన ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది. అక్టోబర్‌ 10–17 తేదీల మధ్య జరిపిన ఈ ప్రీ–పోల్‌ సర్వే బిహార్‌లోని 7 కోట్ల ఓటర్ల నాడిని కనిపెట్టే ప్రయత్నం చేసింది. సీఎం పీఠంపై నితీశ్‌కుమార్‌నే ఉంటారని ఈ సర్వే అంచనా వేసింది. అదే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌ తదితర పారీ్టల మహాఘఠ్‌బంధన్‌కు మెజారిటీకి తక్కువగా సీట్లు దక్కుతాయని వెల్లడైంది. దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ సారథ్యంలోని ఎల్‌జేపీకి 2 నుంచి 6 వరకు సీట్లు వస్తాయని తేలింది.

సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పాలన సంతృప్తి వ్యక్తం చేయగా, 61 శాతం మంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. నితీశ్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు 31 శాతం మంది అభిప్రాయపడగా 34 శాతం మంది కొత్త నేత కావాలని కోరుకుంటున్నట్లు తేలింది. అక్టోబర్‌ 28 మొదలుకొని నవంబర్‌ 7వ తేదీ వరకు మూడు దశలుగా బిహార్‌ అసెంబ్లీలోని 243 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్‌ 10వ తేదీన వెల్లడి కానున్నాయి.  

మరిన్ని వార్తలు