లాక్‌డౌన్‌ భయం.. విచ్చలవిడిగా షాపింగ్‌ 

20 Apr, 2021 13:58 IST|Sakshi

న్యూఢిల్లీ: పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి వా రం రోజుల లాక్‌డౌన్‌ విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిత్యావసరాల కొనుగోళ్లకు దిగారు. నగరంలో పలు ప్రాంతాల్లో మార్కెట్లు, మద్యం దుకాణాలు, మాల్స్‌ వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. లాక్‌డౌన్‌ వేళ బయటకు రాకుండా ఉండాలంటే ఇంట్లో అన్నీ సిద్దంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజలు షాపింగ్‌కు పోటెత్తారు. ఈనెల 26 సాయంత్రం 5గంటల వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే! ఎలాగైనా కొన్ని సరుకులు కొందామని భావిస్తున్న గృహస్థులు ఈ ప్రకటనతో ఒక్కమారుగా పెద్ద ఎత్తున సరుకుల కొనుగోళ్లకు దిగారు. సంవత్సరం తర్వాత కూడా పరిస్థితులు మారలేదని, ఎమర్జెన్సీ వేళల్లో ప్రభుత్వాన్ని నమ్మలేమని, అందుకే సంసిద్ధంగా ఉండేందుకు నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నామని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో లాక్‌డౌన్‌ ప్రకటన కారణంగా భయాందోళన నెలకొందని, అందుకే ఇలా మూకుమ్మడి కొనుగోళ్లకు దిగారని పరిశీలకులు భావిస్తున్నారు.  

చదవండి: (పరిస్థితి భయానకం.. ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృతి)

సందట్లో సడేమియా 
ప్రజల్లో నెలకొన్న భీతిని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు వ్యాపారస్తులు యత్నిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. చాలా షాపుల్లో వస్తువుల ధరలు ఒక్కసారిగా పెంచేశారని దుయ్యబట్టారు. గతేడాది ఇలాగే శానిటైజర్లు, ఫోర్‌ క్లీనర్ల రేట్లు పెంచారని, ప్రసుతం యాలక్కాయల్లాంటి కొన్ని పదార్ధాలు స్టాకు లేవని చెబుతున్నారని ఆరోపించారు. లాక్‌డౌన్‌ అంటేనే భయంగా ఉందని గృహిణులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వారిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ లాక్‌డౌన్‌ పొడిగిస్తే మధ్యతరగతి పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీడీఎంఏ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. మాల్స్, జిమ్స్, ఉత్పత్తి యూనిట్లు, విద్యాసంస్థలు, సినిమాహాల్స్, రెస్టారెంట్లు, బార్లు, పబ్లిక్‌పార్కులు, స్పా మరియు బార్బర్‌ షాపులు మూసివేయాల్సి ఉంటుంది.    

చదవండి: (రెండ్రోజుల్లో నిర్ణయం.. సంపూర్ణ లాక్‌డౌన్‌కే మొగ్గు)

మరిన్ని వార్తలు