వెబ్‌ సిరీస్‌ చూసి ముగ్గురు మిత్రుల దోపిడీ యత్నం

6 Jun, 2023 12:02 IST|Sakshi

కోరికలనేవి అందరికీ ఉంటాయి. అయితే అవి తీరనివిగా మారినప్పుడు కొందరు పెడదారి పడుతుంటారు. కోరికలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బుల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతుంటారు. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లక్నోకు చెందిన ముగ్గురు స్నేహితులకు బర్త్‌డే పార్టీ చేసుకునేందుకు రూ. 25 వేలు అవసరం అయ్యాయి. వారు చూసిన ఒక వెబ్‌ సిరీస్‌లోని కథనాన్ని అధారంగా చేసుకుని దోపిడీకి పథకం వేసుకున్నారు.

తరువాత వీరు ముఖానికి ముసుగులు ధరించి స్థానికంగా ఉన్న ఒక జ్యూయలరీ దుకాణానికి వెళ్లారు. తరువాత వారు ఒక తుపాకీ తీసి, దుకాణం యజమానిని బెదించారు. అయితే వారి ప్రయత్నం విఫలమయ్యింది. వెంటనే వారు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణం యజమాని ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. దీని ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నిందితులలో ఇద్దరు ఖదరా, ఒకరు మండియావ్‌ ప్రాంతానికి చెందినవారన్నారు. వీరిలో ఇద్దరు మాస్క్‌ ధరించారని, ఒకరు రుమాలు ముఖానికి చుట్టుకున్నాడన్నారు.  మే 30 వీరు స్థానికంగా ఉన్న మహేశ్వరి జ్యూయలర్స్‌లో దోపిడీకి ప్రయత్నించారని, సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా వీరిని పట్టుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు అప్పగించామని, వారి దగ్గర నుంచి నంబరు ప్లేటులేని స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

చదవండి: ఉంగరం కావాలని మొండికేసిన వరుడు.. అలా అతని తిక్క  కుదిర్చిన వధువు

మరిన్ని వార్తలు