ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

15 Mar, 2021 21:17 IST|Sakshi

హరిద్వార్‌: భారతీయులు రాముడిని ఎలా కొలుస్తారో, ప్రధాని మోదీ చేసే మంచి పనులకు రాబోయే రోజుల్లో ఆయనను కూడా అలాగే ఆరాధిస్తారంటూ ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్‌ సింగ్‌ రావత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన నేత్ర కుంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు సమాజం కోసం పని చేశారు. అందుకే రాముడిని ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. అలాగే ప్రధాని మోదీ కూడా సమాజం కోసం పని చేస్తున్నారు, కాబట్టి రాబోయే రోజుల్లో ఆయనను కూడా రాముడి అవతారంలా భావించి కొలుస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌ సీఎంగా ఎన్నికయ్యాక పాల్గొన్న తొలి కార్యక్రమంలో తీరత్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, ప్రధాని మోదీ రాముడంతటి గొప్పవాడంటూ గతంలో బీజేపీ నేతలు చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బహిరంగ సభలో మోదీని రాముడితో పోల్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితమే తీరత్‌ సింగ్‌ రావత్‌ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా అనంతరం ఆయన ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
 

మరిన్ని వార్తలు