సాక్షి, హైదరాబాద్: నిరాటంకంగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా మొత్తం సబ్సిడీ ఎత్తివేస్తోంది. దీంతో సామాన్యుడు వంట చేసుకోలేని విధంగా మారింది. అయితే ఇప్పుడు కొద్దిగా ఉపశమనం కలిగే వార్త వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాస్ బండపై రూ.10 తగ్గనుంది.
ఈ మేరకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. గురువారం నుంచి పది రూపాయలకు తక్కువగా గ్యాస్ సిలిండర్ లభించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ గ్యాస్ ధర రూ.819గా ఉంది. కలకత్తాలో రూ.845, ముంబై రూ.819, చెన్నై రూ.835 ధరలు ఉన్నాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే మూడుసార్లు భారీగా గ్యాస్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండడంతో ధరలు తగ్గుతాయని ఓ అధికారి తెలిపారు.