‘దేవుడు చనిపోయాడు.. ఇక ఆ భూమి మాదే’

16 Feb, 2021 18:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన వింత కేసు

ఆలయ భూమిని ఆక్రమించడం కోసం మోసగాళ్ల నిర్వాకం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. రాజధాని లక్నోలో ఉన్న ఓ ఆలయం, అది ఉన్న భూమిని ‘‘దేవుడి’’ పేరిట రిజిస్టర్‌ చేసిన ట్రస్ట్‌కు చెందుతుందని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆలయం, భూమి హక్కుదారైన ‘‘దేవుడు’’ మరణించాడని చెప్పి.. వాటిని ఆక్రమించారు కొందరు వ్యక్తులు. అసలు హక్కుదారు ఫిర్యాదు చేయడంతో ఈ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ వివరాలు.. లక్నో మోహన్‌లాల్‌గంజ్‌ ప్రాంతంలో కుష్మౌరా హలువాపూర్‌లో 100 ఏళ్ల నాటి ఆలయం ఒకటి ఉంది. దీని బాగోగులు చూడటం కోసం శ్రీకృష్ణ-రామ్‌ అనే ‘‘దేవుడి’’ పేరిట ఓ ట్రస్టును నమోదు చేశారు. సదరు ఆలయం, భూమి ట్రస్ట్‌కు చెందుతాయని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు గయా ప్రసాద్‌ అనే వ్యక్తి తాను శ్రీక్రిష్ణ-రామ తండ్రిని అంటూ వచ్చాడు. ఏకీకరణ ప్రక్రియలో భాగంగా 1987లో ‘‘దేవుడైన’’ శ్రీకృష్ణ-రామ మరణించాడని వెల్లడించి.. సదరు ట్రస్ట్‌ని గయా ప్రసాద్‌ పేరు మీదకు మార్చారు. 

ఈ క్రమంలో 1991లో గయా ప్రసాద్‌ మరణించాడు. దాంతో ఈ ట్రస్ట్‌ను అతడి సోదరులు రామ్‌నాథ్‌, హరిద్వార్‌ పేర్ల మీదకు మార్చారు. ఈ విషయం కాస్తా ఆలయ ఒరిజినల్‌ ట్రస్టీ సుశీల్‌ కుమార్‌ త్రిపాఠి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన ఈ వ్యవహారం గురించి 2016 నాయిబ్‌ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అలా ఈ ఫిర్యాదు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఈ క్రమంలో యూపీ ఉపముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ ఈ ఫిర్యాదును ఎస్‌డీఎం ప్రఫుల్లా త్రిపాఠికి బదిలీ చేశారు. ఇక దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.  0.730 హెక్టార్ల ఆలయ భూమిని ఆక్రమించుకోవడం కోసం ఓ వ్యక్తి అసలు ట్రస్టీ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఎస్‌డీఎం సదర్ ప్రఫుల్ల కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘నిజమైనా ట్రస్టీ సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యక్తి శ్రీకృష్ణ-రామ్‌ అనే ‘‘దేవుడి’’ పేరిట ట్రస్ట్‌ రిజిస్టర్‌ చేసి.. సదరు ఆలయం, భూమి ట్రస్ట్‌కు చెందుతాయని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ‘‘దేవుడి’’ తండ్రిని అని చెప్పుకుని గయా ప్రసాద్‌ ట్రస్ట్‌ని తన పేరు మీదకు మార్చుకున్నాడు. ఆ తర్వాత అతడి సోదరులు దీన్ని ఆక్రమించారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ ఆలయాన్ని నిర్మించిన భూమిని గ్రామసభ బంజరు భూమిగా ప్రకటించింది. ప్రసుతం ఈ ఫిర్యాదు ఎస్‌డీఎం కోర్టు విచారణలో ఉంది’’ అని తెలిపారు. 

చదవండి: యజమాని కుమార్తెగా ఫ్యామిలీ సర్టిఫికెట్‌.. భూ కబ్జా
                    కలలో ప్రత్యక్షం: శివుడి కోసం సమాధిలోకి మహిళ

మరిన్ని వార్తలు