విషాదం: ఆ పోలీసు అధికారి ఇకలేరు

9 Jun, 2021 16:57 IST|Sakshi

బతికేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి :  పంజాబ్‌ డీఎస్పీ వీడియో వైరల్‌

ఒక్క అవకాశం అంటూనే.. కానరాని లోకాలకు

చండీగఢ్‌: కరోనా మహమ్మారితో విలవిల్లాడుతూ..చనిపోయాక ఎక్స్‌గ్రేషియా కన్నా..బతికేందుకు అవకాశం ఇవ్వాలని, నిధులు సమకూర్చాలంటూ వేడుకున్న డీఎస్పీ లెవెల్​ అధికారి ఇక లేరు.  పంజాబ్‌కు చెందిన డిప్యూటీ జైలు సూపరిడెంట్​ హర్జిందర్​ సింగ్​  తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజీవ్ కుంద్రా ఈ విషయాన్ని ధృవీకరించారు. మరోవైపు సకాలంలో చికిత్సకు తగిన నిధులు, వైద్యం అందిం ఉండి ఉంటే బతికే వాడని హర్జిందర్​ సోదరుడు హర్దీప్ సింగ్ వాపోయారు.

కరోనా వైరస్‌ కారణంగా డీఎస్పీ హర్జిందర్​ సింగ్​ ఆరోగ్యం గత నెలలో తీవ్రంగా దెబ్బతింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులు చెడిపోవడంతో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని వైద్యులు ప్రకటించారు. దీనికి 70 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని  తెలిపారు. దీంతో తనకు సాయం చేయాల్సిందిగా హర్జిందర్​ సింగ్​ పంజాబ్‌ ముఖ్యమంత్రి  కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను  కోరారు. అలాగే హర్జిందర్ సింగ్ కుటుంబ సభ్యులు మే 20న లూధియానా పోలీసు కమిషనర్ రాకేశ్ అగర్వాల్‌ను కలిసి లంగ్స్‌ మార్పిడికి సాయం చేయాల్సిందిగా కోరారు. అయితే బాధితుడు ఒకవేళ చనిపోతే 50 లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా కుటుంబానికి మాత్రమే అందిస్తామంటూ ఉన్నతాధికారులు మూడు వారాలపాటు హర్జిందర్​ సోదరుడిని తిప్పించుకున్నారు.

దీంతో చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం తనకొద్దని, బతికేందుకు తనకొక అవకాశం ఇవ్వమంటూ ఐసీయూ బెడ్‌మీదనుంచే ప్రభుత్వాన్ని వేడుకున్నహర్జిందర్​ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రాజకీయ దుమారం రేగింది. పోలీస్ డిపార్ట్​మెంట్​తో పాటు ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డీఎస్పీ వైద్యానికి సాయంచేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని స్వయంగా డీజీపీ దిన్‌కర్‌​ గుప్తా ట్వీట్ చేశారు. లూథియానాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్​మెంట్ అందించబోతున్నట్లు,  ట్రాన్స్​ఫ్లాంట్ కోసం హైదరాబాద్​ గానీ, చెన్నై గానీ తరలిస్తామని సిటీ కమిషనర్ రాకేష్​ అగర్వాల్ ప్రకటించారు. కానీ ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

చదవండి: 
వైరల్​ : బతికేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి
DRDO: 2-డీజీ డ్రగ్‌, కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు