జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే!

4 May, 2021 11:09 IST|Sakshi

భోపాల్‌: కరోనా తీవ్రరూపం దాల్చుతుండటంతో మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూ, పాక్షిక లాక్‌డౌన్‌ వంటి చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లాక్‌డైన్‌ ఆంక్షలను అతిక్రమించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్‌ కర్ఫ్యూను బేఖాతారు చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు మధ్యప్రదేశ్‌ అధికారులు వినూత్నంగా రీతిలో శిక్ష విధించారు.

ఇండోర్‌ జిల్లాలోని డెబల్పూర్‌లోని పోలీసులు కోవిడ్‌ కర్ఫ్యూ సందర్భంగా వీధుల్లో తిరుగుతున్న వారిని రోడ్డుపై కప్ప గంతులు వేయించారు. దీనికితోడు డప్పు చప్పుళ్లు నడుమ వారిని గ్రామంలో కొంతదూరం పరిగెత్తేలా చేశారు. పరిమితికి మించి ఆదివారం సాయంత్రం పెళ్లి నుంచి బైక్‌, కార్లలో వెళుతుండగా పోలీసులు వీరిని గుర్తించి ఈ శిక్ష వేశారు. ఇలా చేయడం వల్ల ఇతర వ్యక్తులు కోవిడ్‌ రూల్స్‌ ఉల్లంఘించకుండా ఉంటుందని ఆ ప్రాంత తహసీల్దార్‌ జబరంగ్‌ బహదూర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

కాగా ఇప్పటికే కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిపాల్పూర్‌లో కరనా కర్ఫ్యూ విధించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుటోంది. ఇక ఆదివారం మధ్యప్రదేశ్‌లో 12,662 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,88,368కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య 5,812 కు చేరుకుంది.

చదవండి: కరోనా అలర్ట్‌: దేశంలో 2 కోట్లు దాటిన కేసులు

మరిన్ని వార్తలు