మోదీకి ఇంతకు మించి గొప్ప గిఫ్ట్‌ మరొకటి లేదు!

17 Sep, 2022 11:25 IST|Sakshi

న్యూఢిల్లీ: మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ఎనిమిది చిరుతలు నమీబియా నుంచి కునో నేషనల్‌ పార్క్‌కి రానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మధ్యప్రదేశ్‌ ముఖ్యమత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ మాట్లాడుతూ... మోదీకి తాము ఇంతకు మించి గొప్ప బహుమతి ఇవ్వలేమని అన్నారు. అతిపెద్ద వన్యప్రాణులను జంబో జెట్‌ ద్వారా తరలించడం అనేది చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు.

దీని వల్ల కునో పాల్పూర్‌ ప్రాంతం పర్యాటకంగా వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. భారత్‌  గతంలో ఆసియాటిక్‌ చిరుతలకు నిలయంగా ఉంది. ఐతే 1952 నాటికి ఈ జాతులు అంతరించిపోయాయి. ప్రాజెక్ట్‌ చీతా అనే ఖండాంతర ట్రాన్స్‌లోకేషన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ చిరుతలను నమీబియా నుంచి భారత్‌కి తీసుకువస్తున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి అంతర్‌ ఖండాంతర భారీ వైల్డ్‌ మాంసాహార ట్రాన్స్‌ లోకేషన్‌ ప్రాజెక్ట్‌ అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

ఈ చిరుతలు భారత్‌లోని ఓపెన్‌ ఫారెస్ట్‌ గడ్డి భూములు, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో సహాయపడతాయని పేర్కొంది. అంతేగాదు ఇది జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, నీటి భద్రత, కార్బన్‌ సీక్వెస్ట్రేషన్‌, నేల తేమ సంరక్షణ వంటి పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని వెల్లడించింది.

నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో వస్తున్న 8 చిరుతలు మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యాయి. అక్కడ నుంచి కునో నేషనల్‌ పార్క్‌కి హెలికాప్టర్‌లో తరలిస్తారు.ఈ చిరుతల్లో ఐదు ఆడ చిరుతలు రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసుస్సు గలవి, మూడు మగ చిరుతలు 4 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు గలవి ఉన్నాయి. 

(చదవండి: మోదీ పుట్టిన రోజు ప్రత్యేకం: ఆయన ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?)

డెబ్భై ఏళ్ల తర్వాత స్పెషల్‌ జర్నీతో భారత్‌లో అడుగు.. చీతాల కోసం ఆ ప్లేస్‌ ఎందుకంటే..

మరిన్ని వార్తలు