వైరల్‌ వీడియో: పోలీస్‌పై గ్రామస్థుల విచక్షణ రహిత దాడి

29 May, 2021 13:09 IST|Sakshi

భోపాల్‌: విధుల్లో ఉన్న ఓ పోలీస్‌ అధికారిపై స్థానికులు విచక్షణ రహితంగా దాడికి తెగబడిన ఘటన శుక్రవారం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌కు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతర్‌పూర్‌లోని జామ్‌తులి గ్రామంలో కోవిడ్‌ కర్ఫ్యూని ఉల్లంఘించి కొంతమంది వ్యక్తులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన గ్రామంలోని కొంతమంది మూకుమ్మడిగా పోలీస్‌ దగ్గరకు వెళ్లి అతనిపై దాడికి తెగబడ్డారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను జాతీయ మీడియా సంస్థ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట్లో వైరలవుతోంది.

7 సెక్షన్ల నిడివిగల ఈ వీడియోలో  గాయాలతో పోలీస్‌ కిందపడిపోయి లేవడానికి ఇబ్బందిపడుతున్నట్లు కనిపిస్తోంది. అంతేగాక పోలీస్‌ను కొట్టడానికి వచ్చిన వారిలో ఓ వ్యక్తికి తలపై గాయాలయి ఉన్నాయి. కాగా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, స్థానికులు మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది. అయితే, ఈ దాడికి పాల్పడిన వారిలో ఏ  ఒక్కరూ కూడా మాస్క్‌ ధరించలేదు. దీనికితోడు వారంతా అసభ్య పదజాలంతో మాట్లాడటం కెమెరాలో రికార్డయ్యింది. కాగా పోలీస్‌ ఓ వ్యక్తి తలపై పోలీస్‌ గట్టిగా కొట్టాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందుకే అతనిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. కానీ పోలీసుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తను కేవలం షాప్‌లు మూసేయాలని చెప్పినందుకు కోపంతో తనపై దాడి చేశారని పేర్కొన్నారు.

ఇక ఈ ఘటనపై డీఎస్పీ శశాంక్‌ విలేకరులతో మాట్లాడుతూ.. జామ్‌తులి గ్రామంలో కోవిడ్ కర్ఫ్యూ ఉల్లంఘించబడుతోందని తమకు సమాచారం అందిందన్నారు. వెంటనే పోలీసులు బృందం అక్కడికి వెళ్లిందని,  దుకాణాలను మూసివేయమని చెప్పడంతో  కొంతమంది కోపం తెచ్చుకొని సిబ్బందిని కొట్టారని వెల్లడించారు. తామింకా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు, పూర్తి వివరాలు సేకరించగా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు