దారుణం: భుజంపై వ్యక్తిని మోసుకుంటూ 3 కి.మీ..

16 Feb, 2021 10:00 IST|Sakshi

భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నా వ‍దలని ఊరు జనం

తిడుతూ.. కర్రలతో కొడుతున్న వైనం

భోపాల్‌: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలకు రక్షణ లేదనేది మరోసారి రుజువైంది. దేశంలోని చాలా చోట్ల మహిళలు అనేక వివక్షలు, అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న మహిళ పట్ల స్థానికులు, అత్తింటివారి ఆటవిక చర్యలు మధ్యప్రదేశ్‌లో వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని గునా జిల్లాలో ఒక మహిళ తన భర్తతో విడిపోయి వేరే వ్యక్తితో సహజీవం చేస్తోంది. దీనిని జీర్ణించుకోలేని సదరు గ్రామస్తులు, అత్తింటివారు ఆమె ఇంటికి వచ్చి నానా దుర్భాషవలాడారు. అంతటితో ఆగకుండా మాజీ భర్త కుటుంబంలోని ఒకరిని భుజాలపై మోసుకుంటూ 3 కిలో మీటర్లు నడవాలని హుకుం జారీచేశారు.

తన బతుకు తాను బతుకున్న ఆ మహిళ ఆటవిక మనుషుల ఆగడాలను ఎదిరించలేకపోయింది. అసహాయంగా వారు చెప్పినట్టు అత్తింటివారిలో ఓ వ్యక్తిని భుజాలపై ఎక్కించుకుని నడక సాగించింది. ఆమె నరకయాతన పడుతుంటే కొంత మంది ఆకతాయిలు ఆ దృశ్యాలను ఫోన్లలో వీడియో తీస్తూ​... మరికొందరు ఆమె బాధతో ఒక్కో అడుగు వేస్తుంటే త్వరగా నడువ్..‌ అంటూ హేళన చేస్తూ బ్యాట్లు, కర్రలతో బెదిరింపులకు దిగారు. కొందరు రాక్షసులు ఆమె ఒంటిపై దెబ్బలు కూడా కొట్టారు.

ఈ ఆటవిక చర్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన నలుగురిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం జబువా జిల్లాలో ప్రేమించిన వ్యక్తికోసం ఇంటి నుంచి వెళ్ళిపోయిన మహిళకు గ్రామస్తులు ఇలాంటి శిక్షే విధించారు. అప్పటి ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

చదవండి:  వివాహితపై సామూహిక అత్యాచారం..

మరిన్ని వార్తలు