కేంద్రం గుడ్‌న్యూస్‌! రూ.429.28 కోట్లతో మద్నూర్‌–బోధన్‌ రోడ్డు విస్తరణ 

24 Mar, 2023 04:08 IST|Sakshi

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి

సాక్షి, న్యూఢిల్లీ:  తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందెడ్‌ జిల్లాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేలా మద్నూర్‌– బోధన్‌ రహదారి విస్తరణకుగాను రూ.429.28 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌గడ్కరి తెలిపారు. ఈ మేరకు గురువారం కేంద్రమంత్రి ప్రకటన చేశారు.

కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్‌లోని ఎన్‌హెచ్‌–161బీబీలోని మద్నూర్‌ నుంచి బోధన్‌ సెక్షన్‌ వరకు రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడానికి ఆమోదం తెలిపారు. 39.032 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం(ఈపీసీ) పద్ధతిలో 2022–23 వార్షిక ప్రణాళిక కింద అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఎన్‌హెచ్‌–163జీ(ఖమ్మం–విజయవాడ)లో రేమిడిచెర్ల గ్రామం నుంచి జక్కంపూడి గ్రామం (ఎన్‌హెచ్‌–16లో) వరకు నాలుగు లైన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సెక్షన్‌ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 29.709 కిలోమీటర్ల లేఅవుట్‌కు రూ.1,190.86 కోట్లు ఖర్చు అవుతుందని, ఇతర ఎకనామిక్‌ కారిడార్‌(ఎన్‌హెచ్‌(ఒ)) ప్రోగ్రామ్‌ల కింద హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌లో తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రపద్రేశ్‌లోని ఎన్‌టీఆర్‌ జిల్లాల్లో నిర్మిస్తామని తెలిపారు.   

మరిన్ని వార్తలు