తమిళనాడులో ట్విస్ట్‌.. పొల్లాచ్చి కేసులో పళనిస్వామికి షాక్‌!

12 Feb, 2023 13:52 IST|Sakshi

సాక్షి, చెన్నై: పొల్లాచ్చిలో యువతులు, మహిళలపై జరిగిన లైంగికదాడి వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఈ కేసులో బాధితుల పేర్లను వెల్లడించిన పోలీసు అధికారి పాండియరాజన్, ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం పళని స్వామి, మాజీ సీఎస్‌ను విచారించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలైంది. ఇది సోమవారం విచారణకు రానుంది. 

వివరాల ప్రకారం.. 2019లో కోయంబత్తూరు జిల్లా  పొల్లాచ్చి కేంద్రంగా కొందరు యువకులు ఫామ్‌ హౌస్‌లోకి యువతలు, మహిళలను తీసుకెళ్లి  లైంగిక దాడి చేసి వీడియో చిత్రీకరించి వేధించిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే.  ఈ కేసులో 9 మందిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే బడాబాబులు, రాజకీయ ప్రముఖుల పిల్లలను ఈ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

కాగా, ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే విధంగా హైకోర్టులో చెన్నైకు చెందిన బాలచంద్రన్‌ శనివారం పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పట్లో నిందితులను వెనకేసుకు యత్నించిన పోలీసు అధికారి పాండియరాజన్‌ను సస్పెండ్‌ చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. అలాగే ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఎం, సీఎస్‌లను కూడా ఈ కేసులో విచారించాలని, ఇందుకు సంబంధించిన ఉత్వరులు ఇవ్వాలని కోర్టుకు పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు