నకిలీ వీడియో కేసు.. పోలీసుల కస్టడీలో యూట్యూబర్‌!

31 Mar, 2023 12:32 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోని బీహార్‌ వలస కార్మికులపై దాడులు చేశారంటూ నకిలీ వీడియోలను పోస్ట్‌ చేసిన కేసులో యూట్యూబర్ మనీష్ కశ్యప్‌ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని మధురై కోర్టు ముందు హాజరుపరచగా.. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం న్యాయస్థానం కశ్యప్‌కు మూడు రోజుల కస్టడీని విధించింది. మార్చి 18న జగదీష్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన తర్వాత బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) కశ్యప్‌ను అరెస్టు చేసింది.

 పోలీసుల ప్రత్యేక బృందం ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్ నుంచి తమిళనాడుకు తీసుకువచ్చింది. నకిలీ వీడియోలను వ్యాప్తి చేసినందుకు అతనిపై మధురైలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా, అతనిపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటీవల, తమిళనాడులో వలస కార్మికులపై దాడికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఫ్యాక్ట్‌ చెక్‌ కమిటీ, పోలీసు శాఖ ద్వారా ఈ వీడియోలు ఫేక్ అని తేలింది. దీంతో వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు. వ‌ల‌స కార్మికుల‌పై దాడి జ‌రుగుతున్న‌ట్లు ఫేక్ వీడియోల అంశంపై త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవసరమైన అన్ని సహాయాన్ని వలస కార్మికులకు అందజేస్తామని  హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు