ముంబై: మహారాష్ట్రకు నెలకు 3 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్లు అవసరమని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే సోమవారం పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజుకు 15 లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్థ్యం కలిగి ఉన్నామని ఆయన తెలిపారు. అయితే టీకాల కొరత కారణంగా రోజుకు రెండు నుంచి మూడు లక్షల మందికి మాత్రమే టీకాలు వేస్తున్నామన్నారు. మూడు రోజుల క్రితం ఏడు లక్షల కరోనా వ్యాక్సిన్లు వచ్చాయని, ఈ రోజు (సోమవారం)తో స్టాక్ అయిపోయిందని వెల్లడించారు.
ఇప్పటి వరకు 3,65,25,990 కోట్ల వ్యాక్సిన్లు వచ్చాయని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల వ్యాక్సిన్లను కొనుగోలు చేసిందని మంత్రి అన్నారు. వ్యాక్సిన్లను సక్రమంగా సరఫరా చేస్తే.. అర్హులకు టీకాలు వేసే లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేయవచ్చిని ఆయన అన్నారు. ఇక ఆదివారం మహారాష్ట్రలో కొత్తగా 8,535 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 61,57,799కు చేరుకోగా.. గడిచిన 24 గంటల్లో 156 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1,25,878కు చేరుకున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.