‘దమ్ముంటే ప్రభుత్వాన్ని కూల్చండి’

26 Jul, 2020 14:03 IST|Sakshi

అయోధ్యకు వెళతా : ఠాక్రే

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే విపక్ష బీజేపీకి సవాల్‌ విసిరారు. తమ ప్రభుత్వ భవితవ్యం విపక్షం చేతిలో లేదని  ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తారో చూస్తానని ఠాక్రే కాషాయపార్టీని హెచ్చరించారు. ఒకట్రెండు నెలల్లో తన ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నారని, వారిని తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుతున్నానని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆటో రిక్షా మాదిరిగా మూడు చక్రాలతో సాగుతోందని, పేద ప్రజల కోసం స్టీరింగ్‌ తన చేతిలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మరో ఇద్దరు (కాంగ్రెస్‌, ఎన్సీపీ) వెనుకనుంచి తమకు మద్దతుగా కూర్చున్నారని అన్నారు.

మరి కేంద్రంలో ఎన్డీయే పరిస్థితి ఏంటి? వారికి ఎన్ని చక్రాలున్నాయని ప్రశ్నించారు. గతంలో తాను ఎన్డీయే సమావేశానికి హాజరైనప్పుడు వారికి రైలు తరహాలో 30-35 చక్రాలున్నాయ’ని (పార్టీలు) ఠాక్రే ఎద్దేవా చేశారు. ఇక చైనాతో సరిహద్దు వివాదాన్ని ఠాక్రే ప్రస్తావిస్తూ ఈ అంశంపై దేశానికి ఓ విధానాన్ని నిర్ణయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించానిని అన్నారు. 20 మంది అమర జవాన్ల త్యాగానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఠాక్రే వ్యాఖ్యానించారు. కానీ మనం చైనా యాప్‌లను నిషేధించి సంబరపడ్డామని మోదీ సర్కార్‌కు చురకలు వేశారు.  చదవండి : అమెరికా అధ్యక్షుడిపై ఉద్ధవ్‌ ఠాక్రే సెటైర్లు


భూమిపూజకు హాజరవుతా!
అయోధ్యలో ఆగస్ట్‌ 5న రామ మందిర నిర్మాణానికి నిర్వహించే భూమి పూజకు తాను హాజరవుతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. అయోధ్యలో జరిగే ప్రార్ధనల్లో తాను పాల్గొంటానని ఆయన శివసేన పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్ధారించారు. ‘నేను అయోధ్యకు వెళతా..భూమి పూజలో పాల్గొంటా..ముఖ్యమంత్రి కాకముందూ మందిర నిర్మాణం పట్ల విశ్వాసం ఉందని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అయోధ్యకు వెళ్లి ప్రార్ధనల్లో పాల్గొంటా’నని చెప్పారు.

మరిన్ని వార్తలు