ఎమ్మెల్యే చంద్రకాంత్‌ జాదవ్‌ కన్నుమూత 

3 Dec, 2021 12:07 IST|Sakshi

ముంబై: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రకాంత్‌ జాదవ్‌ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. చంద్రకాంత్‌ జాదవ్‌ మృతి పట్ల రెవెన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్‌ థోరాత్, పార్టీ వర్గీయులు, సన్నిహితులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామమైన కొల్హాపూర్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

చదవండి: (Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ బయటపడింది ఇలా..!)

కొల్హాపూర్‌లో గొప్ప పారిశ్రామికవేత్తగా పేరున్న చంద్రకాంత్‌ జాదవ్‌ ఎన్నికలకు నెల రోజుల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఉత్తర కొల్హాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గతేడాది ఆగస్టులో ఆయనకు కరోనా సోకింది. ఆ సమయంలో ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయింది. స్థానిక ఆస్పత్రిలో సర్జరీ కూడా చేశారు. కానీ, గతవారం మళ్లీ ఆయన అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఒక్కసారిగా ఒంట్లో రక్తం స్థాయి పడిపోవడంతో కన్నుమూశారు.   

మరిన్ని వార్తలు