పరువు నష్టం కేసులో రాహుల్‌కి ఉపశమనం..ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు

15 Apr, 2023 17:36 IST|Sakshi

ఓ పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి మహారాష్ట్రలోని భివండీ కోర్టు ఉపశమనం కల్పించింది. ఈ మేరకు భివండీ కోర్టు రాహుల్‌కి విచారణకు హాజరుకాకుండా ఉండేలా శాశ్వత మినహాయింపు ఇచ్చింది. రాహుల్‌ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఆయన శాశ్వత మినహాయింపుకు అర్హుడని పేర్కొంది. అంతేగాదు పరువు నష్టం కేసులో సాక్ష్యాధారాలను నమోదు చేయడానికి ఈ కేసును జూన్‌ 3కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మహాత్మ గాంధీ హత్యను ఆర్‌ఎస్‌ఎస్‌కి ముడిపెడుతూ.. రాహుల్‌ పలు ఆరోపణలు చేశారు.

దీంతో థానే జిల్లాలోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఆ వ్యాఖ్యలు తమ ప్రతిష్టను కించపరిచేలా ఉందని పేర్కొంటూ.. రాహుల్‌పై రాజేష్‌ కుంతే అనే ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త 2014లో భివండీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై 2018 జూన్‌లో రాహుల్‌ కోర్టు ముందు హాజరయ్యారు కూడా. తాను ఢిల్లీ వాసినని, లోక్‌సభ సభ్యుడిగా తన నియోజకవర్గంలో పర్యటనలు చేయాల్సి ఉంటుందన పేర్కొంటూ కోర్టులో హాజరు నుంచి మినహాయింపు కోరారు. అలాగే అవసరమైనప్పుడూ విచారణలో బదులుగా తన తరుఫున న్యాయవాదిని అనుమతించాలని కోరారు.

ఈ క్రమంలోనే భివాండీ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిందితుడు(రాహుల్‌ గాంధీ)కి కోర్టులో హజరు నుంచి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  విచారణ తేదీల్లో రాహుల్‌ తరుఫు న్యాయవాది క్రమం తప్పకుండా హాజరు కావాలని, కోర్టు ఆదేశించినప్పుడూ నిందితుడు(రాహుల్‌) కూడా హాజరు కావాలని షరతులు విధించింది. కాగా, ఇటీవలే సూరత్‌ కోర్టులో 2019లో నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్‌ని దోషిగా నిర్ధారిస్తూ..రెండేళ్లు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుకి గురయ్యారు. 

(చదవండి: కర్ణాటక ఎన్నికలు: ఏం మాట్లాడతారో?.. రాహుల్‌ గాంధీ కోలార్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి)

మరిన్ని వార్తలు