కరోనా సెకండ్‌ వేవ్‌: మహరాష్ట్రలో జూన్‌ 1 వరకు ఆంక్షలు

13 May, 2021 14:48 IST|Sakshi

ముంబై: కరోనా వ్యాప్తిని అరికట‍్టేందుకు విధించిన ఆంక్షలు జూన్‌ 1 వరకు కొనసాగుతాయని మహరాష్ట్ర ప‍్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త ఆంక్షలతో మహరాష్ట్రలో అడుగుపెట్టే ఇతర రాష్ట్రాల వారు తప్పని సరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ చూపించాలని ప్రభుత్వ సీఎస్‌ సీతారామ్‌ కుంతే విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాలు, ఇతర రవాణా ఉత్పత్తులపై ఆంక్షలు విధించడం లేదని, కాకపోతే రిటైల్‌ వస్తువుల‍్ని ఇంటికి పంపిణీ చేయడంపై షరతులు విధించారు. కార్గో వాహనాల్లో ఇద‍్దరు వ్యక్తులు మించి ప్రయాణించడానికి వీలు లేదని మహరాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఇతర రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్‌ పోర్ట్‌ వాహనాలు మహరాష్ట్రలోకి ప్రవేశించాలంటే నిర్ణీత సమయానికి 48 గంటల లోపు జారీ చేయబడిన నెగిటివ్‌ ఆర్టీపీసీఆర్‌ రిపోర్ట్‌ తప్పని సరిగా చూపించాలని, ఆ రిపోర్ట్‌లో నెగిటివ్‌ ఉంటే వారం రోజుల వరకు చెల్లుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు కరోనా నిబంధనల్ని పాటించని దుకాణాల్ని మూసివేసేలా డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ అథారటీ అధికారులు చర్యలు తీసుకుంటారని సీతారామ్‌ కుంతే వెల్లడించారు. విమానాశ్రయం, పోర్ట్ లలో కరోనా నివారణకు అవసరమైన మందులు లేదా పరికరాలకు సంబంధించి సరుకు రవాణా చేసే సిబ్బంది మెట్రో సేవల్లో ప్రయాణించడానికి  అనుమతులిచ్చింది.
 

మరిన్ని వార్తలు