మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం: బెళగావిలో ఉద్రిక్తత.. భారీగా బలగాల మోహరింపు

6 Dec, 2022 16:08 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది. సరిహద్దు ప్రాంతం బెళగావిలో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నాయి, ‘కర్ణాటక రక్షణ వేదిక’ ఆధ్వర్వంలో బెళగావిలో ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నంబర్‌ ప్లేట్స్‌ ఉన్న వాహనాలే లక్ష్యంగా దాడులు చేపట్టారు ఆందోళనకారులు. ఓ లారీ అద్దలు పగలగొట్టిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. 

కర్ణాటక రక్షణ వేదిక్‌కు చెందిన ఆందోళనకారులు సుమారు 400 మంది కర్ణాటక జెండాలు పట్టుకుని ధార్వాడ్‌ జిల్లా నుంచి బెళగావికి వెళ్లి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర వాహనలపై రాళ్లు రువ్వారు. పుణె నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ లారీ విండ్‌షీల్డ్‌, అద్దం ధ్వంసమైంది. ఈ క్రమంలో భారీగా బలగాలను మోహరించింది ప్రభుత్వం. అయినప్పటికీ పోలీసుల మాట పట్టించుకోకుండా రోడ్లపై బైఠాయించారు. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామల వద్ద వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మరోవైపు.. 1960లో భాష ఆధారంగా రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా మరాఠీ మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకకు తప్పుగా ఇచ్చారని మహారాష్ట్ర వాదిస్తోంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లింది మహారాష్ట్ర. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో తమకు చెందిన కొన్ని గ్రామాలు ఉన్నాయని కర్ణాటక ఇటీవల పేర్కొంది. దీంతో వివాదం మరింత ముదిరింది.

మహారాష్ట్రకు చెందిన మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, శంభురాజ్‌ దేశాయ్‌లు బెళగావిలో మంగళవారం పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అయితే, వారి పర్యటన శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సోమవారం హెచ్చరించటంతో తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. సరిహద్దు వివాదంపై ఈ ఇరువురు మంత్రులను కోఆర్డినేటర్లుగా నియమించింది మహారాష్ట్ర. వారం క్రితం సైతం బెళగావిలో ఓ కళాశాల ఉత్సవాల్లోనూ సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఓ విద్యార్థి కర్ణాటక జెండాను ప్రదర్శించటంతో మరాఠీ విద్యార్థులు అతడిపై దాడి చేశారు.

ఇదీ చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం..ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు

మరిన్ని వార్తలు