షాకింగ్‌: వాడేసిన మాస్క్‌లతో పరుపులు..

12 Apr, 2021 13:30 IST|Sakshi

మహారాష్ట్రలో వెలుగు చూసిన దారుణం

ముంబై: తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మరో సారి పంజా విసురుతోంది. సెకండ్‌ వేవ్‌ మరింత భయపెడుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా నేడు ఒక్క రోజే 1,68,912 కేసులు నమోదయ్యి.. ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రజలందరూ మాస్క్‌ ధరిస్తూ.. సామాజిక దూరం పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కొందరు దరిద్రులు మాత్రం ఏకంగా వాడేసిన మాస్క్‌లతో పరుపులు తయారు చేస్తూ.. ప్రజల జీవితంతో చెలగాటం ఆడుతున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో ప్రథమ స్థానంలో ఉన్న మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని జలగావ్‌ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఇక్కడ కొందరు కక్కుర్తి వ్యాపారులు పరుపుల తయారిలో కాటన్‌, ఇతర పదార్థాల బదులు వాడేసిన మాస్క్‌లు వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు రైడ్‌ చేయగా.. ఈ ప్రాంతంలో ఉన్న వాడేసిన మాస్క్ గుట్టలను చూసి పోలీసులు షాకయ్యారు. అనంతరం ఆ మాస్కల్‌ను తగులబెట్టి.. సదరు కంపెనీ యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వాడేసిన మాస్క్‌ను తకాలంటేనే జనాలు భయంతో వణికిపోతున్న తరుణంలో.. ఇలా ఏకంగా వాటితో పరుపులు తయారు చేయడం మరింత భయపెడుతుంది. వీటిలో ఎవరైనా కరోనా రోగి వాడేసిన మాస్క్‌ ఉంటే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు జనాలు. ఇలాంటి కక్కుర్తి వ్యాపారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

చదవండి: టీవీ సీరియల్స్‌కు బ్రేక్‌.. షూటింగ్‌లు రద్దు

మరిన్ని వార్తలు