అత్యాచారం చేయలేదు.. రిలేషన్‌లో ఉన్నాం: మంత్రి

13 Jan, 2021 11:21 IST|Sakshi
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మినిస్టర్‌ ధనుంజయ్‌ ముండే(ఫైల్‌ ఫోటో)

ముంబై: మహారాష్ట్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి ధనంజయ్‌ ముండేపై 38 మహిళ అత్యాచార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ధనంజయ్‌ స్పందించారు. సదరు మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తుందని.. వాస్తవానికి ఆమె సోదరి, తను రిలేషన్‌లో ఉన్నామని పేర్కొన్నారు. అంతేకాక అక్కాచెల్లెల్లిద్దరు తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ.. డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వీరిద్దరి మీద తాను గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానన్నారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ సోదరితో తనకు 2003 నుంచి సంబంధం ఉందని.. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ధనుంజయ్‌ ముండే తెలిపారు. అంతేకాక ఈ మధ్య కాలంలోనే తమ సంబంధం గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశానని. వారు కూడా అంగీకరించారని.. అంతా బాగుందనుకున్న సమయంలో తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. (చదవండి: కామాంధుడిని పొడిచి చంపేసింది.. ఆపై)

ఇక ధనంజయ్‌ ప్రకటన వెలువడిన అనంతరం మహారాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేటర్‌ రాశారు. రెండు రోజుల క్రితం సదరు మహిళ ధనుంజయ్‌ ముండే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఒడిశాలోని అంధేరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె తరపు లాయర్‌ మాట్లాడుతూ.. ‘బాధితురాలికి 1997 నుంచి ధనుంజయ్‌ ముండేతో పరిచయం ఉంది. తొలుత బాలీవుడ్‌లో సింగర్‌గా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆమెతో క్రమంగా పరిచయం పెంచుకున్నాడు’ అని తెలిపారు. (చదవండి: శివసేనకు చెక్‌: పట్టు బిగిస్తున్న బీజేపీ)

‘ఈ క్రమంలో 2008లో ముండే తొలిసారి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఏళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. ఇక 2019లో ఆమె తనను వివాహం చేసుకోవాల్సిందిగా అతడిని కోరింది. కానీ ధనుంజయ్‌ అందుకు అంగీకరించలేదు. అంతేకాక దీని గురించి ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దాంతో అతడి మీద ఫిర్యాదు చేశాం. కానీ పోలీసులు ధనుంజయ్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయలేదు. మేం కోర్టుకు వెళ్తాం. ఇక బాధితురాలికి ఏమైనా జరిగితే అందుకు ధనుంజయ్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అన్నారు.

మరిన్ని వార్తలు