ప్రతీకారం తీర్చుకుంటాం.. మంత్రికి మావోయిస్టుల బెదిరింపు లేఖ 

13 Feb, 2022 15:29 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా మంత్రిని టార్గెట్ చేసి బెదిరింపు లేఖను పంపించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వివరాల ప్రకారం.. గడ్చిరోలి జిల్లాలో తమ కార్యకర్తలను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండేకు మావోయిస్టులు బెదిరింపు లేఖను పంపారు. బెదిరింపు లేఖ కలకలం రేపడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయన నివాసం వద్ద పోలీసులు నిఘాను పెంచారు. ఈ లేఖకు సంబంధించి థానే పోలీసులకు అందిన ఫిర్యాదును దర్యాప్తు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
చదవండి: దేవతలు నడయాడే భూమిని అవమానిస్తే మీరు సహిస్తారా?

ఈ సందర్భంగా మంత్రి షిండే మాట్లాడుతూ.. ఇంతకు ముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. గడ్చిరోలికి మంత్రిగా ఉన్న తాను అక్కడున్న ప్రజలను కాపాడటమే కాకుండా.. జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులతో పోరాడాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక్కటే మార్గం షిండే సూచించారు. ఇదిలా ఉండగా.. గతేడాది నవంబర్‌లో గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల టాప్ కమాండర్‌తో సహా 26 మంది నక్సల్స్‌ హతమయ్యారు.
చదవండి: కేజ్రీవాల్‌ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ.. 


 

మరిన్ని వార్తలు