Eknath Shinde: శివసేనకు మంత్రి గుడ్‌ బై?.. స్పందించిన ఏక్‌నాథ్‌ షిండే

21 Jun, 2022 16:38 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తొలిసారి స్పందించారు. తాను బాల్‌థాక్రే ప్రియ శిష్యుడిని అని, అధికారం కోసం పార్టీకి ద్రోహం చేయబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘మేం బాలాసాహెబ్‌కు​ నిబద్ధత కలిగిన శివసైనికులం. ఆయనే మాకు హిందుత్వ పాఠాలు బోధించారు. అధికారం కోసం మేం మోసం చేయం. బాలాసాహెబ్ ఆలోచనలు, ధర్మవీర్‌ ఆనంద్ దిఘే సాహెబ్‌ పాఠాలను మరిచిపోం’ అని మరాఠీలో ట్వీట్ చేశారు.

కాగా సోమవారం మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా 12 మంది శివసేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరంతా గుజరాత్‌లోని సూరత్‌లో ఓ రిసార్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నేతలతో ఇవాళ(మంగళవారం) సమావేశం కానున్నారు.
సంబంధిత వార్త: Maharashtra Political Crisis: తిరుగుబాటు మంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై శివసేన చర్యలు..

బీజేపీలో చేరిక?
ఇక ఏక్‌నాథ్‌ షిండేను శాసనసభా పక్షనేత హోదా నుంచి శివసేన తొలగించిన నేపథ్యంలో.. ట్విట్టర్ బయో నుంచి 'శివసేన' అన్న పదాన్ని షిండే తొలగించారు. నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న  షిండే.. తన మద్దతుదారులతో  కలిసి బీజేపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అబ్జర్వర్‌గా కమల్‌నాథ్‌
మహారాష్ట్ర సంక్షోభ నివారణ దిశగా కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేపట్టింది. ఏఐసీసీ నుంచి కమల్‌నాథ్‌ను అబ్జర్వర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. ఎవ‌రీ ఏక్‌నాథ్ షిండే?

>
మరిన్ని వార్తలు