మహారాష్ట్రలో తెరచుకున్న ఆలయాలు

16 Nov, 2020 09:12 IST|Sakshi

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన మత గురువులు 

ప్రజల సహకారంతోనే కరోనా అదుపులోకి వచ్చిందన్న సీఎం 

పాస్‌లు ఉంటేనే షిర్డీ ఆలయంలోకి అనుమతి: షిర్టీ సంస్థాన్‌ 

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో సోమవారం నుంచి ప్రార్థనా స్థలాలు తెరుచుకున్నాయి. దీపావళి పర్వదిన పురస్కరించుకుని సోమవారం నుంచి ప్రార్థన స్థలాలు తెరిచేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్‌–19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల గత ఏడు నెలలకుపైగా అలయాలు, వివిధ మతాల ప్రార్థనా స్థలాలన్నీ మూసి ఉన్నాయి. భక్తులు లేక ఆలయ పరిసరాలన్నీ వెలవెలబోయాయి. అయితే సోమవారం నుంచి ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించగానే ఇటు భక్తులు, అటు ఆలయాల సరిసరాల్లో పూలు, పూలదండలు, కొబ్బరి కాయలు, ప్రసాద సామగ్రి విక్రయించే చిరు వ్యాపారుల్లో ఆనందం వెల్లువిరిసింది. మొన్నటి వరకు ఉపాధిలేక ఖాళీగా ఉన్న పేద వ్యాపారులు సంతోషం పట్టలేక బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ ప్రమాదం ఇంకా పొంచి ఉండటంతో కోవిడ్‌ నిబంధనలు, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని సీఎం ఆదేశించారు.  

లక్ష్మీ పూజ సందర్భంగా..
కోవిడ్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆలయాలతోపాటు ముస్లింల మసీదులు, క్రైస్తవుల చర్చిలు, పార్శీల అగేరీ లు ఇలా అన్ని రకాల ప్రార్థన స్థలాలు ప్రభు త్వం ఆదేశాల మేరకు మూసి ఉన్నాయి. కానీ, ఇటీవల వైన్‌ షాపులు, బార్లు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, నాటకాలు ప్రదర్శించే హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచి్చంది. ఇదే తరహాలో ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతివ్వాలని ఉద్ధవ్‌ ఠాక్రేపై సామాన్య ప్రజలు మొదలుకుని వివిధ సామాజిక సంస్థల నుంచి ఒత్తిడి రాసాగింది. దీంతో కరోనా వైరస్‌ తీవ్రత తాజా పరిస్థితులను అధ్యయనం చేసి ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతిస్తామని అప్పట్లో ఉద్ధవ్‌ ఠాక్రే హామీ ఇచ్చారు. చివరకు శనివారం లక్ష్మీ పూజ పర్వదినం సందర్భంగా సోమవారం నుంచి ఆలయాలు తెరిచేందుకు అనుమతించారు. కరోనా విస్తరించకుండా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలు స్వయంగా రూపొందించుకున్నాయి. 

షిర్గీలో పాసులుంటేనే అనుమతి
షిర్డీలోని బాబా ఆలయంలోకి పాస్‌లుంటునే అనుమతించాలని ఆలయ సంస్థాన్‌ నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగా భక్తులందరిని కాకుండా రోజుకు ఆరు వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు. పాస్‌లు పొందేందుకు ఆన్‌లైన్‌లో ఏర్పాట్లు చేసినట్లు సంస్థాన్‌ పదాధికారులు తెలిపారు. అదేవిధంగా ముంబైలోని ముంబాదేవి గర్భగుడిలోకి ఒకేసారి కేవలం ఐదుగురు భక్తులను అనుమతించనున్నారు. తోపులాటలు జరగకుండా క్యూను క్రమబద్దీకరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఆలయంలో క్రిమిసంహరక మందులు పిచికారి చేయనున్నారు. ఆ సమయంలో ఆలయం మూసి ఉంచనున్నారు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజేషన్‌ టన్నెల్‌ ఏర్పాటు చేయనున్నారు. భక్తులు తమ చేతిలో ఎలాంటి పూలు, హారాలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు, ఇతర పూజ సామగ్రి పల్లెంతో రావొద్దని ఆలయ మేనేజర్‌ హేమంత్‌ మహాజన్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభాదేవిలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయం, పండరీపూర్‌లోని విఠల్, రుక్మాయి మందిరం, కొల్హాపూర్‌లోని తుల్జాభవాని మాత తదితర ఆలయాల యాజమాన్యాలు ఏర్పాట్లు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. కరోనా వైరస్‌ విస్తరించుకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.      

మీ సహకారంతోనే అదుపులోకి కరోనా: సీఎం ఉద్ధవ్‌
లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన తరువాత ఉగాది, నాగపంచమి. రాఖీ పండుగ, గణేశోత్సవాలు, నిమజ్జనోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు ఆ తరువాత దసరా, ఈద్, మౌంట్‌మేరీ జాత ర, ఇప్పుడు దీపావళి ఇలా వివిధ మతాల పండుగలన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సాదాసీదాగా జరుపుకున్నామని సీఎం ఉద్ధవ్‌ గుర్తుచేశారు. ప్రజల సహకారం వల్లే కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చిందని సీఎం తెలిపా రు. ఆలయాలు తెరిచిన తరువాత కూడా ప్రజల సహకారం ఇలాగే ఉండాలని ఉద్ధవ్‌ ఠాక్రే ఆకాంక్షించారు. ఆలయాలకు వ చ్చే భక్తులు ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రార్థనా స్థలం ప్రవేశ ద్వారం వద్ద హ్యాండ్‌ శానిటైజ్, థర్మల్‌ స్క్రీనింగ్‌ కచ్చితంగా చేయాలి.  

మార్గదర్శక సూచనలు 

  • ముఖాలకు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి. మాస్క్‌ లేకుంటే ఆలయంలోకి అనుమతి ఇవ్వకూడదు.  
  • కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేని భక్తులనే అనుమతించాలి. 
  • ఇద్దరి మధ్య ఆరడుగుల దూరం కచ్చితంగా పాటించాలి. 
  • ఏ సమయంలో ఎంతమంది భక్తులను అనుమతించాలనేది ముందే ప్లాన్‌ చేసుకోవాలి. 
  • లోనికి, బయటకు వచ్చే దారులు వేర్వేరుగా ఉండాలి. 
  • మందిరంలో దేవీ, దేవత విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను చేతితో తాకకుండా చూడాలి. 
  • ప్రార్థనా స్థలం పరిసరాల్లో భజనలు, కీర్తనలు ఆలపించే కార్యక్రమాలు నిర్వహించకూడదు. 
  • దర్శనం అనంతరం బయటపడే భక్తులకు చేతితో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయరాదు. 
  • సాధ్యమైనంతవరకు ఆలయానికి బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు రాకుండా నిరోధించాలి.  
  • ఆలయం ఆవరణలో భక్తులు క్రమశిక్షణతోపాటు బాధ్యతగా ప్రవర్తించాలి. ఆలయ కమిటీకి సహకరించాలి.   
మరిన్ని వార్తలు