మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

11 Mar, 2021 11:35 IST|Sakshi

మరో 48 గంటలపాటు  వైద్యుల పర్యవేక్షణలో సీఎం మమతా

టీఎంసీ మేనిఫెస్టో వాయిదా

కోల్‌కతా : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదలయ్యింది. ఛాతినొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో మమత ఇబ్బందులు పడుతున్నట్లు డాక్లర్లు తెలిపారు. ఆమె ఎడమకాలుతో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని, మరో 48 గంటలపాటు మమతా వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం మమతకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. దాడికి నిరసనగా టీఎంసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఇక మమతపై దాడి నేపథ్యంలో ఇవాళ ప్రకటించాల్సిన మేనిఫెస్టో వాయిదా పడింది. మమత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

సీఎం ఆరోగ్య పరిస్థితిపై నేడు టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. మమతా బెనర్జీపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ..రేపటిలోగా  సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశించారు. పశ్చిమ బెంగాల్‌లో‌ మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌లో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. నామినేషన్‌ వేసిన అనంతరం వెనక్కు వెళ్తుండగా, తనపై నలుగురైదుగురు దాడి చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత సంచలన ఆరోపణలు చేశారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేడని, తనపై కుట్ర జరగుతోందని పేర్కొన్నారు. 

చదవండి : (నందిగ్రామ్‌ పర్యటనలో మమతపై దాడి!)
(సీఎం మమతా బెనర్జీపై దాడి: కాలికి గాయం)
 

>
మరిన్ని వార్తలు