మెట్రో స్టేషన్‌లో వికృత చేష్టలు.. మహిళ దగ్గరకు వచ్చి.. వీడియో వైరల్‌

7 Jul, 2022 20:01 IST|Sakshi

ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. యువతులు, మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. మెట్రో రైల్వే స్టేషన్‌లో మహిళ పట్ల ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జూన్‌ 2వ తేదీన చోటుచేసుకోగా.. 100 గంటలపాటు సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

వివరాల ప్రకారం.. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఎల్లో లైన్‌లో జూన్‌ 2న ఒక మహిళ మెట్రో రైలులో ప్రయాణించింది. ఆమె స్టేషన్‌లో కూర్చుని ఉండగా.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక అడ్రస్‌ గురించి అడిగాడు. ఆ అడ్రస్‌ గురించి చెప్పిన ఆమె జోర్‌ భాగ్‌ మెట్రో స్టేషన్‌లో దిగింది. ఫ్లాట్‌ఫామ్‌పై ఒక చోట కూర్చొని క్యాబ్‌ బుక్‌ చేస్తున్నది. నిందితుడు కూడా.. అదే స్టేషన్‌లో దిగాడు.

అనంతరం.. అతడు మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. అడ్రస్‌ అడిగాడు. దీంతో, ఆమె.. అతడికి అడ్రస్‌ చెబుతుండగా.. నిందితుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో షాకైన బాధితురాలు.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం, ఈ ఘటన గురించి సిబ్బందికి చెప్పింది. కానీ, వారు పట్టించుకోకపోవడంతో ట్విట్టర్‌ వేదికగా.. వరుస ట్వీట్స్‌ చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాదాపు 100 గంటలు సీసీ ఫుటేజీని చెక్‌ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని కోట్లా ముబారక్‌పూర్‌లో నివాసం ఉంటున్న మానవ్ అగర్వాల్‌(40)గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం నిందితుడు.. నేపాల్‌కు పారిపోయాడని తెలిపారు. 

ఇది కూడా చదవండి: మెట్రో స్టేషన్‌లో యువతిపై లైంగిక వేధింపులు.. మరీ ఇంత దారుణమా..?

మరిన్ని వార్తలు